ఢిల్లీలో అల్లర్లు తగ్గుముఖం

ఢిల్లీలో అల్లర్లు తగ్గుముఖం

ఢిల్లీలో అల్లర్లు సద్దుమణిగినట్టే కనిపిస్తున్నాయి. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. గురువారం ఉదయం నుంచి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదు. కేంద్రం అదనపు బలగాలను రంగంలోకి దించడం మంచి ఫలితాన్నిస్తోంది. దీంతో.. అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటోంది. సామాన్యులు సైతం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. మరోవైపు.. సమస్యాత్మక ప్రాంతాలు ఖాకీవనంలా మారిపోయాయి. ఎక్కడికక్కడ పోలీసులు కవాతు నిర్వహించారు. ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహిస్తూ.. కిందిస్థాయి సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమీషనర్‌గా నియమితులైన శ్రీవాత్సవ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

సీఏఏ మద్దతుదారులు, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన అల్లర్లలో మృతుల సంఖ్య 35కు చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఎనిమిది మంది చనిపోయారు. మరో 200 మంది గాయాలతో చికిత్స పొందుతున్నారు. వారిలో కొంతమంది పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. మరోవైపు.. క్షేత్రస్థాయిలో సామాన్యులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని భయాందోళనలు తొలిగిపోలేదు. పనిమీద బయటకు వెళ్లి వచ్చే సరికి.. ఇంటిని తగులబెట్టేశారని.. ప్రాణభయంతో పారిపోవాల్సి వచ్చిందని కొందరు బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story