విజయనగరం జిల్లాలో పేదల భూముల్ని లాక్కుంటున్న అధికారులు

విజయనగరం జిల్లాలో పేదల భూముల్ని లాక్కుంటున్న అధికారులు

పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న భూదోపిడీపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల్ని రెవెన్యూ అధికారులు తీసుకోవడాన్ని.. అన్నదాతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం కందివలస గ్రామంలోనూ.. రెవెన్యూ అధికారులు.. భూములు లాక్కోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కందివలస గ్రామంలో చాలా వరకు అందరూ చిన్న సన్నకారులు రైతులే. ఉన్న ఎకరం, అర ఎకరం భూముల్ని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామానికి చెందిన 10 కుటుంబాలకు.. ఈ సాగు భూములే జీవనాధారం. అలాంటిది ఇళ్ల స్థలాల కోసం తమ భూముల్ని లాక్కోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ భూములు వదిలేయాలని తహశీల్దార్‌కు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని ఆందోళన చెందుతున్నారు.

విజయనగరం పట్టణానికి అనుకుని ఉన్న రాకొడులో పచ్చని అరటిపంటను జేసీబీలతో రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు. దీనిపై ఉన్నతాధికారులను అడిగినా ఎవరూ పట్టించుకోవడంలేదు. భూములు తీసుకోవడానికి రెవెన్యూ అధికారులు రావడంతో ఏం చేయాలో తెలియక.. రైతులు పరుగుల మందుల డబ్బాలు పట్టుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పొలాలను ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పారు. 1997 నుంచి పోరాడగా.. తమకు ఈ భూములపై లీజు పట్టాలు అందజేశారని తెలిపారు. తమ పది కుటుంబాలకు ఈ 3 ఎకరాల 30 సెంట్ల భూమే జీవనాధారం అంటున్నారు రైతులు. వీటిపై నిర్మాణాలు చేపట్టాలంటే.. తమ శవాలపై కట్టాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.

ఏడాదికి రెండు పంటలు పండే భూమిని ఎలా లాక్కుంటారని ప్రశ్నిస్తున్నారు అన్నదాతలు. అల్లాడపాలెం గ్రామ పరిధిలో ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ...తమ భూముల్నే రెవెన్యూ అధికారులు ఎందుకు తీసుకుంటున్నారని అడుగుతున్నారు. అయితే రెవెన్యూ అధికారుల లెక్కలు మాత్రం మరోలా ఉన్నాయి. ప్రభుత్వం పరిహారం ఇస్తామని చెబుతున్నా.. రైతులు ఆందోళనలు అర్థరహితమంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story