మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం కేసీఆర్

మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం కేసీఆర్

బిజీ షెడ్యూల్‌లోనూ మానవత్వంతో ఆలోచించి ఓ వృద్ధుడు పడుతున్న కష్టాలను తీర్చారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.. వికలాంగుడైన ఓ వృద్ధుడి మొరను మానవత్వంతో ఆలకించి, అక్కడికక్కడే ఆయన సమస్యను పరిష్కరించారు. సీఎం కేసీఆర్ ఓ ప్రైవేటు కార్యక్రమం కోసం టోలిచౌకి వెళ్లి వస్తుండగా, మార్గమధ్యలో వికలాంగుడైన వృద్ధుడు చేతిలో దరఖాస్తుతో కనిపించారు. వెంటనే కేసీఆర్‌ కారు దిగి ఆయన దగ్గరకు వెళ్లారు. సమస్యేంటో అడిగి తెలుసుకున్నారు. మహ్మద్ సలీమ్‌గా పరిచయం చేసుకున్న వృద్ధుడు.. తప పరిస్థితిని, కుటుంబం పడుతున్న కష్టాలను సీఎంకు వివరించాడు. నాలుగేళ్ల క్రితం బిల్డింగ్‌పై నుంచి పడడంతో కాలు విరిగిందని, తన కొడుకు ఆరోగ్యం కూడా బాగా లేదని, ఉండడానికి ఇల్లు కూడా లేదని, తగిన సహాయం చేయాలని కోరాడు. వెంటనే ముఖ్యమంత్రి స్పందించారు. సలీమ్ సమస్యలను పరిష్కరించాలని, పెన్షన్ మంజూరు చేయాలని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతిని ఆదేశించారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో టోలీచౌకిలో సలీమ్ నివాసముంటున్న ఇంటికి వెళ్లారు కలెక్టర్‌ శ్వేతా మహంతి. వారి కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సలీమ్ వికలాంగుడని ధ్రువీకరిస్తూ సదరం సర్టిఫికెట్ ఉండడంతో అప్పటికప్పుడు పెన్షన్ మంజూరు చేశారు. అలాగే జియాగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేశారు. ప్రభుత్వ ఖర్చులతో సలీమ్‌కు వైద్య పరీక్షలు చేయించి, చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చారు. సలీమ్‌ కొడుకు కూడా అనారోగ్యంతో బాధపడుతుండడంతో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. నిత్యం బిజీబిజీగా ఉండే ముఖ్యమంత్రి ఓ వృద్ధుడు పడుతున్న కష్టాలను స్వయంగా తెలుసుకుని సాయం చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story