వికటించిన వైద్యం.. యువకుడు మృతి.. పరారీలో డాక్టర్
వైద్యం వికటించి ఓ యువకుడు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. బెజ్జంకి మండలం చీలాపూర్ గ్రామానికి చెందిన కత్తి వెంకటేష్ అనే యువకుడు గత రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో స్థానిక RMP డాక్టర్ శ్రీకాంత్ వద్దకు వెళ్లాడు. అయితే.. జ్వరం తగ్గేందుకు ఆ RMP డాక్టర్ అవసరానికి మించి ఎక్కువ మోతాదులో మందును ఇంజక్షన్ రూపంలో ఇవ్వడంతో వెంకటేష్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో.. రోగి వెంకటేష్ను మెరుగైన చికిత్స కోసం కరీంనగర్కు తరలించారు.
అయితే.. మోతాదుకు మించి ఇంజక్షన్ ఇవ్వడం వల్ల వెంకటేష్ మరణించాడని అక్కడి డాక్టర్లు ధృవీకరించారు. దీంతో.. వెంకటేష్ బంధువులు మృతదేహంతో RMP డాక్టర్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. అయితే.. విషయం తెలుసుకున్న RMP డాక్టర్ శ్రీకాంత్ అప్పటికే తన ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. ఈనేపథ్యంలో స్థానిక పోలీసులు మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించారు. అయితే.. RMP డాక్టర్ శ్రీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసే వరకు తాము ఇక్కడి నుంచి కదిలేదని ఇంటి ముందు బైఠాయించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com