ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం లెక్క తప్పింది.. తలకిందులుగా బడ్జెట్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం లెక్క తప్పింది..  తలకిందులుగా బడ్జెట్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం లెక్క తప్పింది. బడ్జెట్ తలకిందులవుతోంది. జనవరి నెలాఖరు వరకు ఆశించిన రెవెన్యూ వసూళ్లలో రాష్ట్రానికి సగం కూడా దక్కలేదు. ఇది బడ్జెట్‌ ఖర్చులపై ప్రభావం చూపిస్తోంది. ఈ ఆర్థిక ఏడాదిలో ఒక లక్ష 78 వేల 700 కోట్ల వరకు రాబడి వస్తుందని అంచనా వేశారు. అయితే.. గట్టిగా 86 వేల కోట్లు మాత్రమే వచ్చింది. ఇది రాబడితో పోలిస్తే 48 శాతం మాత్రమే. గత సంవత్సరం కంటే ఈసారి మరింత వెనుకబాటు కనిపిస్తోంది. 2018-19 సంవత్సరంలో రెవెన్యూ వసూళ్ల అంచనా లక్ష 55 వేల 507 కోట్లు కాగా... 2019 జనవరి నెలాఖరు వరకు 91 వేల 755 కోట్లు వచ్చాయి. అంటే.. 59 శాతం. ఈసారి ఆర్థిక కార్యకలాపాలు తగ్గిపోవడం.. ఇతరత్రా కారణాలతో రాష్ట్రానికి వచ్చే అన్ని రకాల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడింది. పన్ను ఆదాయాలు, జీఎస్టీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ ఫీజులు, ఎక్సైజ్‌ ట్యాక్స్‌, పన్నేతర ఆదాయం.. ఇలా ఏ విభాగం చూసినా అంచనాలకు తగినట్టు లేవు. అన్నిట్లోను భారీ కోతలే కనిపిస్తున్నాయి.

రాష్ట్ర బడ్జెట్‌లో కేంద్ర సాయంపైనా అంచాలు తప్పాయి. మూడేళ్లుగా ఇదే పరిస్థితి. కేంద్రం నుంచి ఆశించిన దాంట్లో నాలుగో వంతు కూడా దక్కలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో 61 వేల కోట్లకుపైగా వస్తుందని అంచనా వేశారు. కానీ.. జనవరి నెలాఖరు వరకు దక్కింది 13 వేల 558 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే.. ఆశించిన మొత్తంలో కేవలం 22 శాతం మాత్రమే. మొత్తం వసూళ్లపైనా ఇది ప్రభావం చూపింది. బడ్జెట్ అంచనాల్లో మొత్తం 2.14లక్షల కోట్లుగా లెక్కిస్తే.. జనవరి నెలాఖరుకు వచ్చిన మొత్తం 1.33 లక్షల కోట్లు. అంటే 62 శాతం మాత్రమే. ఈ ప్రభావం సహజంగానే రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులపైనా కనిపిస్తోంది.

పెట్టుబడి వ్యయం చాలా స్వల్పంగా మారింది. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తమ్మీద 32 వేల 293 కోట్లు పెట్టుబడి వ్యయంగా బడ్జెట్‌ అంచనాల్లో చూపారు. జనవరి నెలాఖరు వరకు కేవలం 7 వేల 297 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. బడ్జెట్‌ అంచనాల్లో ఇది కేవలం నాలుగో వంతు మాత్రమే. అదే సమయంలో రెవెన్యూ లోటు కట్టలు తెంచుకుంది. బడ్జెట్ పద్దుల్లో రెవెన్యూ లోటును ఒక వెయ్యి 778 కోట్లుగా చూపించారు. జనవరి వరకు 10 నెలల కాలంలో లోటు.. 34 వేల 690 కోట్లకు చేరింది.

Tags

Read MoreRead Less
Next Story