మున్సిపల్ ఛైర్మన్కు లక్ష జరిమానా విధించిన కేటీఆర్
తెలంగాణలో పట్టణాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పట్టణ ప్రగతి కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. పట్టణాలన్నీ కడిగిన ముత్యంలా తయారవుతున్నాయి. ఖమ్మంలో పర్యటించిన ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్.. లకారం మినీ ట్యాంక్ బండ్ను ప్రారంభించారు. మినీ ట్యాంక్బండ్పై స్కై సైక్లింగ్, ఒపెన్ జిమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మినీ ట్యాంక్బండ్ ప్రాంతంలో మంత్రి మొక్కలు నాటారు. అనంతరం సిటీలోని పెవిలియన్ మైదానంలో బాస్కెట్బాల్ ఇండోర్ స్టేడియం, శాంతినగర్ జూనియర్ కళాశాల, కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానమైన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఏఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు.
అటు.. ఇల్లందులో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కేటీఆర్తో పాటు మంత్రులు పువ్వాడ అజయ్, వేముల ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్, చిల్డ్రన్ పార్క్కు శంకుస్థాపన చేశారు. అనంతరం సింగరేణి స్కూల్ గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. నాలుగేళ్ల వరకు ఎలాంటి ఎన్నికలు లేవని.. అయినా, రాజకీయ నేతలు జనంలోకి వస్తున్నారంటే పట్టణ ప్రగతే కారణమని కేటీఆర్ అన్నారు. ఇదిలా ఉండగా.. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా తన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు లక్ష జరిమానా విధించారు కేటీఆర్. ఈ జరిమానా ఏకంగా మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లుకు విధించడం విశేషం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com