జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా అనుమానితుల కోసం ప్రత్యేక వార్డులు
ప్రపంచాన్ని వణికిస్తున్న కోరనా వైరస్ను ఎదుర్కొంనేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. ఖమ్మం జిల్లాలోనూ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా వైద్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో 8 పడకల కరోనా వార్డును ఏర్పాటు చేశారు.
అటు.. నిజామాబాద్ జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. కరోనా అనుమానితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో.. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్తోపాటు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్ప్రే, శానిటైజర్లు చల్లుతున్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందవద్దని.. వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
కరోనా వైరస్ పై నల్లగొండ జిల్లా వైద్య శాఖా అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేకంగా ఓ ఐసోలేషన్ వార్డు సిద్ధం చేశారు. వైద్య నిపుణులను కూడా నియమించారు. హెచ్.ఐ.వి., స్వైన్ ఫ్లూ, డెంగ్యూ తర్వాత.. ఇప్పుడు కరోనా కలవరపెడుతోందన్నారు డీహెచ్ఎంవో కొండల్ రావు. అయితే, ఈ వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు.. జనసంచారం ఎక్కువగా వున్న ప్రాంతాల్లో ప్రజలు తిరగకూడదని అన్నారు.
అటు.. కరోనా వ్యాధి లక్షణాలున్న వ్యక్తలు సంఖ్య పెరుగుతుండటంతో మెదక్ జిల్లా వైద్య శాఖ అలర్ట్ అయ్యింది. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. అనుమానితులకు వైద్యం అందించేందుకు అన్ని రకాల వసతులు కల్పించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com