తెలుగుదేశం అంటే బీసీలు. అందుకే జగన్.. బీసీల గొంతు కోస్తున్నారు: బాబు

తెలుగుదేశం అంటే బీసీలు.. బీసీలంటే తెలుగుదేశం అని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అందుకే సీఎం జగన్ బీసీలపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ల కోత బీసీలకు కోలుకోలేని దెబ్బ అన్నారు. ఈ నిర్ణయంతో 16 వేల పదవులు కోల్పోతారని చెప్పారు చంద్రబాబు. నిరసనగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అటు న్యాయపోరాటం, ఇటు ప్రజా పోరాటం ఉధృతం చేయాలని సూచించారు. జీవో 558 ద్వారా జగన్ ప్రభుత్వం బీసీల గొంతు కోసిందని మండిపడ్డారు చంద్రబాబు. రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24శాతానికి తగ్గించడం ఉన్మాద చర్యగా అభివర్ణించారు. బీసీల గొంతు నొక్కేందుకే శాసన మండలి రద్దుకు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. సబ్ ప్లాన్ నిధులను మళ్లించడం, అసైన్డ్ భూములు లాక్కోవడంతోపాటు కార్పొరేషన్లనూ నిర్వీర్యం చేశారని ఆరోపించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించడాన్ని సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టును ఆశ్రయించారు టీడీపీ నేతలు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్ల కుదింపు నిర్ణయం సీఎం జగన్ కనుసన్నల్లో జరిగిందని ఆరోపించారు. సొంత కేసులకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి లాయర్లను పెట్టుకున్న జగన్‌.. బీసీల విషయంలో ఆ పని ఎందుకు చేయలేదని నిలదీశారు.

వైసీపీ నేతలు ఇప్పటి నుంచే ప్రజలను ప్రలోభ పెడుతున్నారని టీడీపీ ఆరోపించింది. శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ పార్టీ రంగులు వేశారని.. అటు వాలంటీర్లు అధికార పార్టీకే ఓట్లు వేయాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలంటూ జిల్లా కలెక్టర్ జె. నివాస్‌ను కలిశారు టీడీపీ నేతలు.

బలహీనవర్గాలకు తీరని అన్యాయం చేసిన జగన్ బీసీల ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు రాజ్యాధికారం దక్కకూడదన్న దురుద్దేశంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story