స్థానిక సంస్థల ఎన్నికలు : జగన్‌ సర్కార్‌ కు భయం

స్థానిక సంస్థల ఎన్నికలు : జగన్‌ సర్కార్‌ కు భయం

ఏపీ రాజధాని అమరావతి పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జగన్‌ సర్కార్‌ భయం పట్టుకుంది. ఉవ్వెత్తున రాజధాని ఉద్యమం ఎగిసిపడుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిలిపివేసింది. నరససరావుపేట, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల ఉన్నతాధికారుల ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తులు పంపించింది.

అటు అమరావతి మెట్రోపాలిటన్ కార్పొరేషన్ ఏర్పాటు పేరుతో రాజధాని గ్రామాల్లో ఎన్నికలు నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. తుళ్లూరు మండలంలోని 19 గ్రామాల్లో సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిలిపివేయాలని లేఖలో కోరింది. హైకోర్టులో ఉన్న కేసులు, వ్యాజ్యాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవలసిందిగా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది

అసెంబ్లీలో సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి అమరావతి గ్రామాల్లో ఉవ్వెత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వీరికి సంఘీభావంగా జిల్లాల్లోని ఇతర ప్రాంతాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారు.83 రోజులుగా మహిళలు, రైతులు దీక్షలు, ర్యాలీలు ఆందోళనలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి తప్పదన్న భయంతో వైసీపీ ప్రభుత్వం వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది.

రాజధాని పరిధిలోని యర్రబాలెం, బేతపూడి, నవులూరు గ్రామాలను మంగళగిరి మున్సిపాలిటీలో.. పెనుమాక, ఉండవల్లి గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిటీలో కలిపే ప్రతిపాదన చేస్తోంది. నిడమర్రు, కురగల్లు, కృష్ణాయపాలెం, నీరుకొండతో పాటు తుళ్లూరు మండలంలోని గ్రామాలను కలిపి అమరావతి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం తీసుకున్న తాజాగా నిర్ణయంతో తుళ్లూరు మండలం స్థానిక ఎన్నికలకు పూర్తిగా దూరం కానుంది.

Tags

Read MoreRead Less
Next Story