మారుతీరావు అంత్యక్రియుల సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

మారుతీరావు అంత్యక్రియుల సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

మారుతీరావు అంత్యక్రియుల సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తండ్రి భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు వచ్చిన కుమార్తె అమృతను.. మారుతీరావు కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అమృత గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. అయితే ఈ పరిస్థిని ఊహించిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు మధ్య అమృతను శ్మశానవాటికకు తీసుకెళ్లారు. అయినా అప్పటకే భారీగా శ్మశాన వాటికకు చేరుకున్న మారుతీ రావు బంధువులు అమృత గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.

ప్రణయ్‌ కుటుంబ సభ్యులతో కలిసి పోలీసు వాహనంలో వచ్చిన అమృత.. వాహనం దిగి తండ్రి భౌతికకాయం వద్దకు వెళ్తున్న క్రమంలో.. ఆమెకు వ్యతిరేకంగా స్థానికులు, కుటుంబ సభ్యులు, బంధువులు నినాదాలు చేశారు. అమృత గో బ్యాక్‌, ‘మారుతీరావ్‌ అమర్‌ రహే’ అంటూ అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసుల సాయంతో ఆమె తిరిగి వాహనం ఎక్కి కూర్చున్నారు. పోలీసుల సూచనమేరకు తండ్రిని చివరి చూపు చూడకుండానే వెనుదిరిగారు.

మరోవైపు మారుతీరావు మృతికి సంబంధించిన పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక బయటకు వచ్చింది. మారుతీరావు ఒంటిపై ఎటువంటి గాయాలు లేవని... విషం కలిపిన గారెలు తిన్న కారణంగానే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. విషం కారణంగా రక్త ప్రసరణ ఆగిపోయి శరీరంలోని అవయవాలన్నీ పనిచేయకుండా ఆగిపోయాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో బ్రెయిన్‌ డెడ్‌ అయి.. ఆ తర్వాత గుండెపోటు వచ్చినట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story