బెంగళూరును బెంబేలెత్తిస్తోన్న 'కరోనా'..

బెంగళూరును బెంబేలెత్తిస్తోన్న కరోనా..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత ఐటీ రాజధాని బెంగళూరును బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే అక్కడ తొలి కేసు నమోదుకాగా.. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. కొత్తగా మూడు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి బి.శ్రీరాములు వెల్లడించారు. ప్రస్తుతం కర్నాటకలో కోవిడ్‌-19 నలుగురికి ఉన్నట్లు నిర్థారించామని, వారిని, వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా ఉంచి వారి ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నామని తెలుపుతూ శ్రీరాములు ట్వీట్‌ చేశారు. కరోనా వైరస్‌ పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, వైరస్‌ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సోమవారం అమెరికా నుంచి బెంగళూరుకు వచ్చిన ఓ టెక్కికి కరోనా వైరస్ వున్నట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో అతనితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు బెంగళూరులోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. అటు ముందు జాగ్రత్త చర్యగా ప్రాథమిక పాఠశాలలు మూసివేశారు. అయితే, కరోనా సోకిన టెక్కీ 2 వేల 666 మందిని కలిసనట్టు అంచనా వేస్తున్నారు. అతనితో పాటు బస్సు, విమానం, కారులో ప్రయాణించిన వారందరినీ గుర్తించి గృహనిర్బంధంలో వుంచినట్టు తెలుస్తోంది. వారందరికీ వైద్యసేవలు అందిస్తున్నట్టు సమాచారం.

అటు కేరళలో సైతం కొత్తగా మరో ఆరు కేసులు నమోదైనట్టు సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. దీంతో కేరళలో వైరస్ బారిన పడినవారి సంఖ్య 12 కు చేరుకుంది. వైరస్ అంతకంతకూ విస్తరిస్తుండటంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. తాజా కేసులతో దేశంలో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 56 కు చేరుకుంది.

Tags

Read MoreRead Less
Next Story