రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఏపీ హైకోర్ట్ తీవ్ర ఆగ్రహం

రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఏపీ హైకోర్ట్ తీవ్ర ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక ఎన్నికల్లో నెలకొన్న అవ్యవస్థపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి అనేక సూటి ప్రశ్నలు సంధించిన న్యాయస్థానం.. పదే పదే చెబుతున్నా అధికారుల తీరు మారకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. చిత్తూరు, కడప జిల్లాల్లో అధికార దుర్వినియోగంపై టీడీపీ నేత కోవెలముడి రవీంద్ర న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. చిత్తూరులో చీరల పంపిణీ, కడపలో డిప్యూటీ సీఎం గ్రామ వాలంటీర్లతో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తీరుపై న్యాయ స్థానానికి ఫిర్యాదు చేశారు. ఇళ్ల స్థలాలు రావాలంటే అనుకూల ఓట్లు వేయాలన్న ప్రచారాలకు సంబంధించిన వీడియో ఆధారాలు సైతం సమర్పించారు. అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. పిటిషనర్‌ ఇచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని ఈసీని న్యాయస్థానం కోరింది. అయితే కలెక్టర్ల నుంచి నివేదిక కోరామని ఈసీ న్యాయవాది తెలపడంపై సీజే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ విశేష అధికారాల గురించి ప్రస్తావించిన సీజే.. కలెక్టర్లు, ఎన్నికల సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం ఎన్నికల సంఘం పరిధిలోనే ఉంటారని గుర్తు చేశారు. పిటిషనర్ 3వ తేదీన ఫిర్యాదు చేస్తే ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కలెక్టర్ల నుంచి నివేదికలు కూడా తెప్పించుకోలేని స్థితిలో రాష్ట్ర ఈసీ ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

అలాగే ఇంత తక్కువ సమయంలో ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల నిర్వహణ ప్రభుత్వ నిర్ణయం అని ఈసీ తరపు న్యాయవాది బదులివ్వడంతో.. నామినేషన్లకు 5రోజుల గడువు ఇవ్వాల్సి ఉండగా 3రోజులే ఇచ్చారని పిటిషనర్ తరపు న్యాయవాది వీరారెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీజే ఈసీ పని తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఎన్నికల ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సోమవారం నాటికి తమకు తెలపాలని ఆదేశిస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ఎన్నికల సంఘానికి తెలపాలంది హై కోర్ట్

Tags

Read MoreRead Less
Next Story