రాష్ట్రంలో పరిపాలన దారుణంగా ఉంది : టీడీపీ
స్థానిక ఎన్నికల్ని ఓ ప్రహసనం మార్చిన వైసీపీ సర్కార్ తీరుపై టీడీపీ తీవ్రంగా మండిపడుతోంది. టీడీపీ అభ్యర్థులపై దాడి చేయడం.. నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం.. నామినేషన్ పత్రాల్ని చించివేయడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో పరిపాలన దారుణంగా ఉందని.. రాజ్యాంగ విరుద్దంగా సాగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నిలదీశారు. ఇలాంటి అరాచక పాలనను చూస్తూ కూర్చోబోమని హెచ్చరించారు.
రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నా ఎన్నికల కమిషన్ ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదని చంద్రబాబు విమర్శించారు. అధికారులు, పోలీసులు ప్రభుత్వానికి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు.
అటు పోలీసుల వైఖరిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. బోండా ఉమ, బుద్దా వెంకన్న, న్యాయవాదిపై దాడికి పాల్పడిన కిషోర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. సాక్షాత్తూ డీజీపీయే ఓ ముద్దాయిలా కోర్టు ముందు తలదించుకుని నిలబడడం పోలీసు శాఖకే అవమానకరమని విమర్శించారు.
అటు..తెనాలి నాలుగో వార్డు నుంచి టీడీపీ తరపున పోటీచేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థి ఇంట్లో కావాలనే మద్యం బాటిల్స్ పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ను విడుదల చేశారు.
వైసీపీ నేతలు పథకం ప్రకారమే ప్రత్యర్థి పార్టీ నేతలపై దాడులకు దిగుతున్నారని వామపక్ష నేతలు ఆరోపించారు. నామినేషన్లు వేయకుండా బెదిరింపులకు దిగుతున్నారని.. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని మండిపడ్డారు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ.
వైసీపీ దాడులను నిరసిస్తూ పలు ప్రాంతాల్లో ఎన్నికలను బహిష్కరించింది టీడీపీ. డోన్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నామని వెల్లడించారు మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి. అటు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంతో పాటు చిత్తూరు జిల్లా పుంగనూర్ నియోజకవర్గంలోని అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ బహిష్కరించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com