అదే సంకల్పం, అదే నినాదం.. అమరావతి కోసమే..
అదే సంకల్పం, అదే నినాదం. అమరావతి గ్రామాల్లో రాజధాని నినాదం హోరెత్తుతోంది. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ రైతులు గళమెత్తుతున్నారు. 94 రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుళ్లూరు, మందడంలో మహాధర్నాలు, వెలగపూడిలో రిలే దీక్షలు చేపట్టారు. రాయపూడి, కృష్ణాయపాలెం, యర్రబాలెం, తాడికొండ అడ్డరోడ్డు, పెదపరిమి, తాడేపల్లిలోని శిబిరాలు ఆందోళనలతో దద్దరిల్లాయి.
కరోనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని అమరావతి జేఏసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి శిబిరంలో నియమిత సంఖ్యలో ఉద్యమకారులు పాల్గొంటారని తేలిపింది. ఒక్కొక్కరికి మధ్య 3 మీటర్ల దూరం పాటించాలని నిర్ణయించారు. రోజూ రాత్రి 7:30కి అమరావతి వెలుగు పేరుతో.. ప్రతి ఇంటిముందు కొవ్వత్తులు వెలిగించి నిరసనలు తెలుపనున్నారు. ఉద్యమం రూపుమారుతుందే కానీ.. ఉద్యమం మాత్రం కొనసాగుతుంది జేఏసీ నేతలు స్పష్టం చేశారు..
కరోనా నివారణకు ప్రధాని చేసిన సూచనలను పాటిస్తామని తెలిపారు జేఏసీ నాయకులు. జనతా కర్ఫ్యూకి పూర్తిస్థాయిలో సహకరిస్తామన్నారు. కర్ఫ్యూ సమయానికి ముందు, తర్వాత శిబిరాల్లో గంటపాటు కూర్చోవాలని నిర్ణయించారు..వందో రోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపై చర్చిస్తామన్నారు.. ప్రధాని మోదీ సూచన మేరకు పాటిస్తున్న జాగ్రత్తలను ప్రస్తావిస్తూ ఆయనకు లేఖ రాయనున్నారు జేఏసీ నేతలు. పెళ్లి వేడుకలను కూడా దీక్షాల శిబిరాల్లో నిర్వహిస్తూ.. నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమరావతిని సాధించే వరకూ పోరాటం ఆగదంటున్నారు రైతులు.
ఇప్పటికైనా ప్రభుత్వం తమ మొండివైఖరి వీడాలని.. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఓవైపు 29 గ్రామాల ప్రజలు అమరావతి కోసం పోరాటం చేస్తూంటే.. ప్రభుత్వం పెయిడ్ ఆర్టిస్టులతో 3రాజధానులకు మద్దతుగా ఆందోళనలు జరిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. అటు వివిధ జిల్లాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో రాజధాని గ్రామాలకు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. ఇది కేవలం 29 గ్రామాల పోరాటం కాదని... 5 కోట్ల ప్రజలకు సంబంధించిన అంశమని భరోసా ఇస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com