95వ రోజుకి చేరిన అమరావతి ఉద్యమం

95వ రోజుకి చేరిన అమరావతి ఉద్యమం

అమరావతి ఉద్యమం 95వ రోజుకు చేరింది. ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న రాజధాని రైతుల్లు మాత్రం అదే సంకల్పం, అదే నినాదం! మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ రైతులు గళమెత్తుతున్నారు. తుళ్లూరు, మందడంలో మహాధర్నాలు, వెలగపూడిలో రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. రాయపూడి, కృష్ణాయపాలెం, యర్రబాలెం, తాడికొండ అడ్డరోడ్డు, పెదపరిమి, తాడేపల్లిలోని శిబిరాలు ఆందోళనలతో దద్దరిల్లాయి.

కరోనాను దృష్టిలో ఉంచుకొని అమరావతి జేఏసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి శిబిరంలో నియమిత సంఖ్యలో ఉద్యమకారులు పాల్గొంటారని తెలిపింది. ఒక్కొక్కరికి మధ్య 3 మీటర్ల దూరం పాటించాలని నిర్ణయించారు. రోజూ రాత్రి 7:30కి అమరావతి వెలుగు పేరుతో.. ప్రతి ఇంటిముందు కొవ్వత్తులు వెలిగించి నిరసనలు తెలుపనున్నారు. ఉద్యమం రూపుమారుతుందే కానీ.. ఉద్యమం మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు జేఏసీ నేతలు.

జనతా కర్ఫ్యూకి పూర్తిస్థాయిలో సహకరిస్తామన్నారు రాజధాని రైతులు. కర్ఫ్యూ సమయానికి ముందు, తర్వాత శిబిరాల్లో గంటపాటు కూర్చోవాలని నిర్ణయించారు..వందో రోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపై చర్చిస్తామన్నారు. పెళ్లి వేడుకలను కూడా దీక్షాల శిబిరాల్లో నిర్వహిస్తూ.. నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమరావతిని సాధించే వరకూ పోరాటం ఆగదంటున్నారు రైతులు.

ఇప్పటికైనా ప్రభుత్వం తమ మొండివైఖరి వీడాలని.. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు రైతులు. ఓవైపు 29 గ్రామాల ప్రజలు అమరావతి కోసం పోరాటం చేస్తూంటే.. ప్రభుత్వం పెయిడ్ ఆర్టిస్టులతో 3 రాజధానులకు మద్దతుగా ఆందోళనలు జరిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు.

Tags

Read MoreRead Less
Next Story