జగన్ సర్కార్‌కు ఒకేరోజు నాలుగు ఎదురుదెబ్బలు

జగన్ సర్కార్‌కు ఒకేరోజు నాలుగు ఎదురుదెబ్బలు

జగన్ సర్కార్ కు ఒకేరోజు నాలుగు ఎదురుదెబ్బలు తగిలాయి. మూడు అంశాల్లో హైకోర్టు, సుప్రీం కోర్టు షాక్ ఇవ్వగా.. పార్లమెంట్ సమావేశాల వాయిదా రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడంపై సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసింది. పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వ భవనాలకు కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా..? అని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలను సమర్థిస్తూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. అధికారంలో ఉన్న పార్టీలు ప్రభుత్వ కార్యాలయాలకు ఇష్టమొచ్చిన రంగులు వేసుకుంటూ పోతారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగులు మార్చే విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.

ఇక, రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాలవారికి ఇళ్ల కేటాయింపుపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ప్రభుత్వం జారీచేసిన జీవో 107 పై స్టే ఇచ్చింది. రాజధాని అభివృద్ధి కోసం ఇచ్చిన భూములను వేరే ప్రాంతాల వారికి కేటాయించడం సరికాదని రైతులు కోర్టుకు వెళ్లడంతో దీనిపై పలు దఫాలుగా వాదనలు జరిగాయి. రాజధానిలో భూములను అక్కడి పేదలకు కేటాయించాలని మాత్రమే సీఆర్డీఏ చట్టంలో ఉందని పిటిషనర్‌ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ప్రభుత్వం ఇక్కడి స్థలాలను విజయవాడ నగరంలో ఉన్న వారికి, మంగళగిరి, దుగ్గిరాలకు చెందిన వారికి పంచాలని నిర్ణయించడం చట్ట విరుద్ధమని వాదించారు. ఐతే.. ఈ వాదనతో ప్రభుత్వ అడ్వొకేట్ విభేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు జీవో 107పై స్టే విధించింది. అలాగే అసైన్డ్‌ భూములను వెనక్కి తీసుకుంటూ ఇచ్చిన జీవో 44పై కూడా హైకోర్టు స్టే విధించింది.

అటు పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం విశాఖ జిల్లాలో ల్యాండ్ పూలింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయిచింది. ఇందులో భాగంగా ఆరువేల ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జీవో ఇచ్చింది. తాజాగా ఆ జీవోపైనా హైకోర్టు స్టే విధించింది. దీంతో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్టయింది.

మరోవైపు, పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడటంతో జగన్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. దీంతో.. ఏపీ శానమండలి రద్దు బిల్లు అక్కడ చర్చకు రాకుండా పోయింది. పార్లమెంట్ తదుపరి సమావేశాలు జరిగే వరకు.. మండలి రద్దుకు అవకాశమే ఉండదు. ఆ సమావేశాల్లోను మండలి బిల్లు చర్చకు రావాల్సి ఉంటుంది. దానికి ఉభయ సభలు ఆమోదం తెలిపి.. రాష్ట్రపతి సంతకం చేస్తేనే.. మండలి రద్దు అవుతుంది. దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో.. ప్రభుత్వం ముందు చాలా ప్రాధాన్యాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఏపీ శాసన మండలి రద్దు ఇప్పట్లో సాధ్యం కాదని చెప్తున్నారు. మరి, సెలెక్ట్ కమిటీ విషయంలో ఎలా ముందుకెళ్తారన్నది ఆసక్తిగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story