ప్రపంచమంతా కరోనా భయంతో వణుకుతుంటే.. కొందరు తాపీగా కోడి పందేలు వేస్తున్నారు

ప్రపంచమంతా కరోనా భయంతో వణుకుతుంటే.. కొందరు తాపీగా కోడి పందేలు వేస్తున్నారు. విషయం పోలీసులకు తెలిసింది. అంతే.. వాళ్లను ఉరికించి, ఉరికించి కొట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని గాయత్రి గుడి సమీపంలో కోడిపందాలు మొదలుపెట్టారు. లాక్‌డౌన్‌ సంగతి పూర్తిగా విస్మరించారు. ఈ విషయం పోలీసుల చెవిన పడింది. స్పాట్‌కు చేరుకున్న ఖాకీలు లాఠీలకు పనిచెప్పారు.

పోలీసులను చూసి అవాక్కయిన పందెంరాయుళ్లు.. మహిళల చాటున దాక్కునే ప్రయత్నం చేశారు. ఆ మహిళలు కూడా మగవాళ్లకు రక్షణగా నిలిచే ప్రయత్నం చేశారు. దీంతో.. వాళ్లకూ లాఠీల దెబ్బ రుచి చూపించారు పోలీసులు.

కరోనా భయంతో దేశమంతా లాక్‌డౌన్‌ ప్రకటిస్తే.. కోడిపందాలు ఆడటం తాడేపల్లిగూడెంలో హాట్ టాపిక్ అయింది. ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎవరైనా ఎక్స్‌ట్రాలు చేస్తే.. కేసులు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story