శానిటైజర్ను ఆల్కహాల్ అనుకుని తాగిన ఖైదీ.. చివరకు..
పొరపాటున ఆల్కహాల్ అనుకుని శానిటైజర్ తాగిన ఓ ఖైదీ శుక్రవారం మృతి చెందాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని పాలక్కాడ్లో రామన్ కుట్టి అనే వ్యక్తి ఫిబ్రవరి 18 నుంచి రిమాండ్ ఖైదీగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే రామన్కుట్టి జైలు లోపల ఉన్నట్టుండి కుప్పకూలిపోవడంతో బుధవారం ఉదయం ఆసుపత్రిలో చేర్చారు. "రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు జైలు ప్రాంగణంలో (ఖైదీలచే) తయారయ్యే శానిటైజర్ బాటిల్ తాగినట్లు మేము అనుమానిస్తున్నాము" అని జైలు సీనియర్ అధికారి ఒకరు పిటిఐకి చెప్పారు.
మంగళవారం రాత్రి సాధారణ స్థితిలోనే ఉన్నాడు.. బుధవారం రోల్ కాల్ కోసం కూడా హాజరయ్యాడు, కాని ఉదయం 10.30 గంటలకు కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారని, శవపరీక్ష నిర్వహించిన తర్వాతే అతని మరణానికి ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. కాగా జైలు అధికారులు ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ను హ్యాండ్ శానిటైజర్ యొక్క ప్రధాన కంటెంట్ గా ఉపయోగిస్తారు. అతని చావుకు ఇదే కారణంగా భావిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com