కరోనాపై పోరుకు విప్రో, ప్రేమ్జీ ఫౌండేషన్ రూ. 1125 కోట్లు విరాళం
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తుంది. ఈ ప్రాణాంతక వైరస్పై పోరు కోసం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా మహమ్మారి నుంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి, మనవతా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి పలువురు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, విరాళాలు అందిస్తున్నారు. తాజాగా విప్రో లిమిటెడ్, విప్రో ఎంటర్ప్రైజెస్, అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ కలిసి రూ.1,125 కోట్ల సాయాన్ని అందించడానికి ముందుకొచ్చాయి. మొత్తం విరాళంలో విప్రో రూ.100కోట్లు, విప్రో ఎంటర్ప్రైజెస్ రూ.25కోట్లు, అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ తరఫున 1000 కోట్లను తమవంతు సాయంగా కేటాయించినట్లు.. మూడు సంస్థలు కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
విప్రో వార్షిక..కంపెనీ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధి నుంచి కాకుండా అదనంగా ఈ సాయాన్ని ప్రకటించామని, అలాగే ఫౌండేషన్ సాధారణ దాతృత్వ ఖర్చులతో సంబంధం లేకుండా ఫౌండేషన్ నుంచి కూడా అదనంగా విరాళం ఇస్తున్నట్లు ప్రతినిధులు పేర్కొన్నారు. విప్రో ఫౌండర్ అజీమ్ ప్రేమ్జీ 2019 మార్చిలో సామాజిక సేవ నిమిత్తం తన సంపదలో 52,750 కోట్ల రూపాయలు(ఆయన షేర్లలో 34 శాతానికి సమానం) వెచ్చించనున్నట్లు ప్రకటించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com