కరోనా సోకిందని సోషల్ మీడియాలో ప్రచారం.. వ్యక్తి ఆత్మహత్య
కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది మరణిస్తున్నారు. లక్షలాదిమంది ఈ వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇండియాపై కూడా ఈ మహమ్మారి పంజా విసిరింది. ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోతుంటే.. వైరస్ సోకుతుందనే భయంతో మరి కొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తికి కరోనా సోకిందని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో.. మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. మదురైలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది.
తమిళనాడులోని మదురైకి చెందిన 35 ఏళ్ల వ్యక్తి కేరళలో కూలీగా పనిచేస్తున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో మదురైలోని తన స్వగ్రామానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో అతనిలో కరోనా లక్షణాలు కనిపించడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో అతన్ని హాస్పటల్కి తరలిస్తున్న వీడియోలను స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అతను తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే పరీక్షలో అతడికి నెగటివ్ అని రావడం గమనార్హం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com