అందరి చూపు భారత్ వైపు.. నిన్న అమెరికా ఈరోజు పాక్..
ప్రపంచమంతా ఒకటే మాట్లాడుకుంటోంది. కరోనాను కట్టడి చేయడం ఎలా.. వ్యాధి నివారణ చర్యలు ఎలా.. ఏ చిన్న సహాయం దొరుకుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మొన్నటికి మొన్న అమెరికా.. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు కావాలని అగ్ర రాజ్య అధినేత ట్రంప్ భారత ప్రధాని మోదీని అర్ధించారు. మానవత్వంతో స్పందించిన ప్రధాని వెంటనే వారు కోరినన్ని మాత్రలు పంపించారు.
ఇక ఇదే క్రమంలో భారత్ అంటే ఒంటి కాలు మీద లేచే పాకిస్థాన్ సైతం భారత్ సహాయాన్ని కోరుతోంది. తమ దేశంలో వెంటిలేటర్ల కొరత ఎక్కువగా ఉందని మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ వాపోతున్నారు. ఈ క్లిష్ట సమయంలో వెంటిలేటర్లు ఇచ్చి తమ దేశాన్ని ఆదుకోవాలని అక్తర్.. మోదీని కోరుతున్నారు. కష్ట కాలంలో సాయం చేస్తే కలకాలం గుర్తుపెట్టుకుంటామంటున్నారు. మొత్తం 10వేల వెంటిలేటర్లు కావాలని కోరుతున్నారు. కాగా, పాకిస్థాన్లో కరోనా కేసుల సంఖ్య పెరగడమే అక్తర్ అభ్యర్థనకు కారణం. ఇప్పటి వరకు అక్కడ 4 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సమయంలో ఇరు దేశాలు.. భారత్ - పాక్లు తమ మత భేదాలను మరిచి పోయి ఒకరికొకరు సాయంగా నిలవాలని అక్తర్ కోరుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com