లాక్డౌన్ పొడిగింపుతో ఎయిర్లైన్స్ షాక్.. ప్రయాణికులకు నో రిఫండ్
కరోనా వైరస్ను నివారించడానికి దేశవ్యాప్తంగా తొలి విడతలో విధించిన లాక్డౌన్ ఏప్రిల్ 14తో ముగుస్తుందని, ఆ తర్వాత ప్రయాణాలకు అనుమతిస్తారని భావించారు. ఈ నేపథ్యంలో కొందరు ముందస్తు ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుని.. విమాన టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. అయితే, వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందటం.. వైరస్ తీవ్రత విపరీతంగా పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ను మే 3 వరకూ పొడిగిస్తూ మోదీ సర్కార్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏప్రిల్ 15 నుంచి మే 3 వరకు బుకింగ్లను విమానయాన సంస్థలు రద్దు చేస్తున్నాయి. అయితే, ముందుగా రిజర్వేషన్ చేసుకున్న వారికి రిఫండ్స్ ఇచ్చే అవకాశం లేదంటూ, ఎయిర్ లైన్స్ సంస్థలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ చెప్పాయి. విమానాలు రద్దు అయినా, టికెట్ల రిఫండ్ చేయరాదని నిర్ణయించామని, ప్రయాణికులు అదనపు రుసుములు చెల్లించకుండా, మరో తేదీని ఎంచుకుని ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవచ్చని విమానయాన సంస్థలు తెలిపాయి. అయితే ఇందులో కొన్ని సంస్థలు కొన్ని నెలల వరకు సమయం ఇవ్వగా, మరికొన్ని సంస్థలు ఏడాది వరకు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చని తెలిపాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com