కోవిడ్ నుంచి కోలుకున్నాను.. యోగా నన్ను చాలా కాపాడింది: నటి

కోవిడ్ నుంచి కోలుకున్నాను.. యోగా నన్ను చాలా కాపాడింది: నటి

ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో దేవుడు ముందే నిర్ణయించేస్తాడేమో.. ముందు జరగబోయే ఉపద్రవాలకి మనల్ని శారీరకంగా, మానసికంగా సంసిద్ధులను చేసేస్తాడు. అందుకే అనుకుంటా 6 ఏళ్లుగా నేను చేస్తున్న యోగా నన్ను కోవిడ్ నుంచి కోలుకునేలా చేసింది అని అంటున్నారు బాలీవుడ్ నిర్మాత కుమార్తె నటి జోయా మొరానీ. కోవిడ్ నుంచి తాను బయట పడిన విధానాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు.

మార్చి 18నుంచి నాలో కరోనా లక్షణాలు ప్రారంభమయ్యాయి. ముందు జ్వరం వచ్చింది. తరువాత విపరీతంగా దగ్గు రావడం మొదలైంది. దాంతో పాటు భరించలేని తలనొప్పి.. కొన్ని రోజులకి నాలో ఏదీ వచ్చినా తట్టుకునే శక్తిని పూర్తిగా కోల్పోయానేమో అనిపించింది.. ఇవన్నీ కరోనా లక్షణాలు అని అనిపించిన వెంటనే నా కుటుంబ సభ్యులకు దూరంగా ఓ గదిలో స్వీయ నిర్భంధంలో ఉండిపోయాను. ఆ సమయంలో తులసి నీళ్లు, పసుపు వేసుకుని పాలు తాగడం, యోగా చేయడం వంటివి చేస్తుండేదాన్ని.

అనంతరం కోవిడ్ రిపోర్ట్ రావడంతో నన్ను ఆసుపత్రికి తరలించారు. 21 రోజుల పాటు కరోనా లక్షణాలు విపరీతంగా ఉన్నాయి. అక్కడ వైద్యులు ఎంతో ఓర్పుగా ఉన్నారు. అందరినీ ఒకే విధంగా ట్రీట్ చేస్తున్నారు. నాకంటే పెద్ద వయసు వారు కూడా చికిత్స తీసుకుంటున్నారు.. నేను నా సహనాన్ని కోల్పోకూడదు అని నాకు నేను నచ్చచెప్పుకునేదాన్ని. నేను ఈ వ్యాధి నుంచి త్వరగా బయటపడతాను అని సెల్ఫ్ మోటివేషన్ చేసుకునేదాన్ని. అందుకు యోగా చాలా ఉపయోగపడింది.

ప్రస్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటి వద్దే ఉంటున్నాను. ఎక్కువగా విశ్రాంతి తీసుకోమన్న వైద్యుల సూచనను పాటిస్తున్నాను. కరోనాతో పోరాడి నా శరీరం పూర్తిగా నీరసించి పోయింది. ఇప్పటికీ దగ్గు వస్తూనే ఉంది. ఇంకా 14 రోజులు స్వీయ నిర్భంధంలోనే ఉండాలి. రోగ నిరోధక శక్తిని పేంచే ఆహారం తీసుకోమని వైద్యులు సూచించారు అని జోయా మోరానీ చెప్పుకొచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story