అందులో భాగంగానే కన్నా లక్ష్మీనారాయణపై విమర్శలు : పవన్ కళ్యాణ్
వైసీపీ ప్రభుత్వానికి చెందిన కొందరు నాయకులను ఉద్ద్యేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఈ మేరకు ఓ లెటర్ రూపంలో తన భావాలను వ్యక్తపరిచారు. అందులో ఇలా పేర్కొన్నారు.. ఆంధ్రప్రదేశ్ లో కరోనా నివారణపై కంటే రాజకీయ ప్రత్యర్థులపైనా కొందరు అధికార పార్టీ పెద్దలు దృష్టి పెట్టినట్లు గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు తెలియచేస్తున్నాయని అన్నారు. ప్రపంచాన్ని క్రమక్రమంగా ఆక్రమిస్తున్న కరోనా కారణంగా అగ్రరాజ్యాలుగా పేరుపొందిన దేశాలు చేష్టలుడిగి చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోందని చెప్పారు. అన్ని వసతులూ ఉన్న అగ్రరాజ్య ఆసుపత్రులు రోగులందరికీ సేవలు అందించలేక నానా అవస్థలు పడుతున్నాయి. హైడ్రాక్సీ క్లోరోక్విన్ వంటి మందులను పంపమని భారతదేశాన్ని ప్రాధేయపడుతున్నాయని పేర్కొన్నారు. పెట్రోల్ ధరలు పాతాళంలోకి జారిపోయి చమురు ఉత్పత్తి దేశాలు దిక్కులు చూస్తున్నాయని గుర్తుచేశారు. ఈ పరిణామాలన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనపైన ప్రభావం చూపేవే అని అన్నారు. ఇక మన దేశంలో లక్షలాదిమంది కార్మికులు ముఖ్యంగా వలస కార్మికులు ఉపాధి కోల్పోయి, ఊరుకాని ఊరిలో వుంటూ ఆకలికి అలమటిస్తున్నారు. రైతులు తమ పంటను అమ్ముకునే దారి లేక పార బోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ ను సైతం విడిచిపెట్టలేదన్న పవన్ కళ్యాణ్.. ఏపీలో పెరుగుతున్న కేసుల తీరుచూస్తే ఈ మహమ్మారి ఎప్పటికి శాంతిస్తోందో ఊహకు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల ప్రజలు పెరుగుతున్న పాజిటివ్ కేసులు చూసి బెంబేలెత్తిపోతున్నారు. ప్రపంచం అంతా ఇటువంటి విపత్కర పరిస్థితిలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో తప్పులు వేలెత్తి చూపేవారిపై బురద చల్లే కార్యక్రమాన్ని అధికార పార్టీ పెద్దలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. అత్యవసర వైద్య సేవలు అందించవలసిన తరుణంలో రాజకీయాలను భుజాలకు ఎత్తుకున్నారని.. ఈ క్రమంలో బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణపై జరుగుతున్న వ్యక్తిగత విమర్శలు ఇందులో భాగంగానే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఆయనపై జరుగుతున్న వ్యక్తిత్వహనన దాడి ప్రజాస్వామ్యవాదులు ఖండించవలసిన రీతిలో, ఆయనకు క్షమాపణలు చెప్పాలని అడిగే స్థాయిలో ఉందని చెప్పారు. ఈ ఆపత్కాల సమయంలో జనసేన పార్టీ అందరినీ కోరుతున్నది ఒక్కటే... కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయేంత వరకూ రాజకీయాలను పక్కన పెడదాం. చిల్లర రాజకీయాలకు దూరంగా ఉందాం అని అన్నారు. ప్రజలను రక్షించుకోవడం, వారి సంక్షీమం, అవసరాలు, ఆకలిదప్పులు తీర్చడంపై మన శక్తియుక్తుల్ని కేంద్రీకరిద్దాం అని చెప్పారు. ఇకనైనా ఇలాంటి రాజకీయాలు ఆపకపోతే ప్రజలు తిరగబడే పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com