మాస్కులు కుట్టిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ భార్య
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కట్టడి చేయడానికి కేంద్ర సర్కార్ లాక్ డౌన్ అమలు చేస్తోంది. ఈ కరోనాపై పోరాటానికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరు ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. కరోనా కట్టడి కోసం కొందరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. మరికొందరు సినీ తారలు, రాజకీయ నేతల కుటుంబాలు మాస్కులు తయారు చేస్తున్నారు. కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో.. ఆ మహమ్మారి నుండి మనల్ని మనం కాపాడుకునేందుకు మాస్కు తప్పనిసరి. అందుకే కొందరు మాస్కులను కుట్టి పంపిణీ చేస్తున్నారు. తాజాగా భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ భార్య సవితా కోవింద్ మాస్క్లు తయారు చేస్తున్నారు. స్వయంగా మిషన్పై ఆమె మాస్కులు కుట్టారు.
ప్రెసిడెంట్ ఎస్టేట్లోని శక్తి హాత్లో ముఖానికి ధరించే మాస్క్లను ఆమె కుట్టారు. ఢిల్లీలో ఉన్న షెల్టర్ హోమ్స్లో ఆ మాస్క్లను పంపిణీ చేయనున్నారు. ఎరుపు రంగు మాస్క్ను ముఖానికి ధరించిన సవితా కోవింద్ కుట్టుమిషన్పై మాస్క్లు కుట్టారు. అందరం కలిసికట్టుగా కోవిడ్19పై పోరాటం చేయాలన్నారామె. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలంతా సోషల్ డిస్టాన్సింగ్ పాటించాలన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com