అర్నాబ్ గోస్వామిపై నమోదైన అన్ని కేసులపై స్టే విధించిన సుప్రీం కోర్టు.. కానీ..

రిపబ్లిక్ టీవీ చీఫ్ ఆర్నాబ్ గోస్వామికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తలు ప్రచురించారని.. ఆయనపై కేసు నమోదైంది. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్లను ఆధారంగా ఎలాంటి చర్యలూ తీసుకోకుండా స్టే విధించాలని కోరుతూ గోస్వామి పెట్టుకున్న పిటిషన్ మేరకు సుప్రీం కోర్టు మూడు వారాల పాటు ఆయనకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ కోసం మూడు వారాల్లోపు దరఖాస్తు చేసుకునేందుకు కూడా ఆయనకు అవకాశం ఇచ్చింది. గోస్వామి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
అయితే.. దేశంలో పలు చోట్ల ఆయనపై కేసులు నమోదవ్వగా.. అన్నింటిపై స్టే విధించిన ధర్మాసనం.. ఒక్క నాగ్పూర్లో దాఖలైన కేసుపై మాత్రం స్టే విధించలేదు. ఈ కేసును ముంబైకి బదిలీ చేశారు.
అయితే.. ఆర్నాబ్ గోస్వామి, రిపబ్లిక్ టీవీకి పూర్తి భద్రత కల్పించాలంటూ సుప్రీంకోర్టు ముంబై పోలీస్ కమిషనర్కి ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల పాల్గఢ్లో చోటుచేసుకున్న మూకహత్యకు సంబంధించి సోనియా గాంధీపై గోస్వామి తన టీవీలో చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా పలుచోట్ల ఎఫ్ఐఆర్లు దాఖలైన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com