అక్కడికి మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదు : దీదీ సర్కార్ నిర్ణయం
సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఆధారంగా పశ్చిమ బెంగాల్ లోని మమతా బెనర్జీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి కోవిడ్ ఆసుపత్రులలోకి మొబైల్ ఫోన్లను తీసుకురాకూడదని వైద్యులు, ఇతర సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కోల్కతాలోని కోవిడ్ -19 ఆసుపత్రిలో చిత్రీకరించిన వీడియోను కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో షేర్ చేశారు.. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి కోవిడ్ ఆసుపత్రులలో మొబైల్ ఫోన్ వాడకాన్ని నిషేధించామని.. ఎవరూ వాడొద్దని బెంగాల్ ప్రధాన కార్యదర్శి రాజీవా సిన్హా సూచించారు. మొబైల్ ఫోన్లు అత్యంత అంటు పరికరాలని.. ఆసుపత్రుల లోపలకు వీటిని తీసుకురాకూడదని.. వైద్యులు, ఇతర సిబ్బంది వారి మొబైల్ ఫోన్లను బయట డిపాజిట్ చేసి రావాలని సూచించారు. అయితే ల్యాండ్లైన్లను మాత్రం ఉపయోగించవచ్చని చెప్పారు.
కాగా గత రెండు రోజుల కిందట ఎంఆర్ బంగూర్ హాస్పిటల్ లోని పురుషుల వార్డ్ లోపల గుర్తుతెలియని వ్యక్తులు వీడియో చిత్రీకరణ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో అది వైరల్ అయింది. ఆ వీడియోలో ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో రోగులతో పాటు రెండు మృతదేహాలను కూడా ఉంచినట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోను కేంద్ర మంత్రి షేర్ చెయ్యడంతో.. దీంతో ఆసుపత్రులలో ఫోన్ల వాడకాన్ని నిషేధించింది దీదీ సర్కార్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com