కరోనా వేళ.. రూర్కీ ప్రొఫెసర్ ఎంత మంచి వార్త చెప్పారు

కరోనా వేళ.. రూర్కీ ప్రొఫెసర్ ఎంత మంచి వార్త చెప్పారు

కేవలం అయిదు సెకన్ల వ్యవధిలో కరోనా వైరస్ సోకిందీ లేందీ గుర్తించవచ్చంటున్నారు ఐఐటీ రూర్కీ ప్రొఫెసర్. సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కమల్ జైన్.. తనకి ఈ సాప్ట్‌వేర్ అభివృద్ధి చేయడానికి 40 రోజులు పట్టిందని అన్నారు. ఈ సాప్ట్‌వేర్ ఉపయోగించి వైద్యులు ఒక వ్యక్తికి తీసిన ఎక్స్‌రే ద్వారా రోగికి న్యూమోనియా లక్షణాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని గుర్తించడంతో పాటు అది కరోనాకు సంబంధించినదా లేక ఇతర బ్యాక్టీరియా వల్ల వచ్చిందా అనేది ఐదు సెకన్లలో గుర్తించవచ్చని తెలిపారు. తద్వారా కరోనా వ్యాది విస్తరణ అడ్డుకోవడానికి వీలవుతుందని అన్నారు.

కరోనా, న్యూమోనియా, క్షయ రోగులతో సహా 60 వేల మంది రోగుల ఎక్స్‌రే స్కాన్‌లను విశ్లేషించిన తరువాత మొదట ఒక కృతిమ బేస్ ఆధారిత డేటాబేస్ అభివృద్ధి చేసినట్లు ఆయన వెల్లడించారు. అలాగే అమెరికాకు చెందిన ఎన్‌ఐహెచ్ క్లినికల్ సెంటర్ ఛాతిఎక్స్‌-రే డేటాబేస్‌ను కూడా విశ్లేషించానని చెప్పారు. తాను రూపొందించిన ఈ సాప్ట్‌వేర్.. పరీక్ష ఖర్చులను తగ్గిస్తుందని అన్నారు. అలాగే చాలా మంది వైద్యులను కరోనా బారిన పడకుండా కాపాడుతుందని అన్నారు.

ఇక దీని పేటెంట్ హక్కుల కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్)కు దరఖాస్తు చేసినట్లు తెలిపారు. అయితే జైన్ వాదనను బలపరుస్తూ వైద్య సంస్థల నుంచి ప్రస్తుతానికి ఎటువంటి ప్రతిపాదన రాలేదు. కాగా, దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు 23 వేలు దాటింది. మరణాల సంఖ్య 718 అని గణాంకాలు చెబుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story