పనిమనిషి అంత్యక్రియలు నిర్వహించిన గౌతం గంభీర్..

పనిమనిషి అంత్యక్రియలు నిర్వహించిన గౌతం గంభీర్..

ఆమె మా ఇంట్లో పనిమనిషి కాదు. మా కుటుంబ సభ్యురాలు. నా పిల్లల ఆలనా పాలన చూసుకున్నారు. ఆమెను పనిమనిషి అని ఎలా అంటాను అని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అనారోగ్య సమస్యలతో మృతి చెందిన ఆమెకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాకు చెందిన సరస్వతి పాత్రా (49) ఆరేళ్ల నుంచి గంభీర్ ఇంట్లో పని చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న ఆమె ఈనెల 21న ఆస్పత్రిలోనే మరణించారు.

లాక్‌డౌన్ అమలులో ఉన్నందున మృత దేహాన్ని స్వస్థలానికి తరలించే అవకాశం లేకపోయింది. ఇదే విషయాన్ని గంభీర్ దృష్టికి తీసుకు వచ్చారు సరస్వతి కుటుంబసభ్యులు. దాంతో గంభీర్ తానే దగ్గరుండి స్వయంగా సరస్వతి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న గంభీర్ కుల, వర్గ, ప్రాంత, సామాజిక అంతరాలకు అతీతంగా వ్యవహరించడంలోనే హుందాతనం ఉంటుందని నమ్ముతాను. మెరుగైన సమాజాన్ని నిర్మించేందుకు ఇంతకంటే మంచి మార్గం లేదు.. నా దృష్టిలో ఇదే నిజమైన భారత్.. ఓం శాంతి అని ట్వీట్ చేశారు. పనిమనిషికి అంత్యక్రియలు నిర్వహించిన గంభీర్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒడిశాకు చెందిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం గంభీర్‌ను ప్రశంసించారు. గంభీర్ మరికొందరికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. కరోనా మనుషుల్లో మానవత్వాన్ని మేల్కొల్పుతోంది. మంచిని పంచుతోంది. అదే సమయంలో అయిన వాళ్ల కడసారి చూపుకు నోచుకోనివ్వకుండా చేస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story