ఈ డ్రైవర్ ను మా కంపెనీలో సలహాదారుగా పెట్టుకోవాలి : ఆనంద్ మహీంద్ర
ట్విట్టర్లో యాక్టివ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా మరోసారి ట్విట్టర్ ద్వారా ఆసక్తికర విషయంపై ట్వీట్ చేశారు.. కరోనా కట్టడికి వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక, భౌతిక దూరాలు పాటించడమే ఇప్పుడున్న మార్గం.. ఈ నేపథ్యంలో ఓ ఆటోరిక్షాను అరలుగా మార్చి ప్రయాణికులకు సామాజిక దూరం వెలుసుబాటు కల్పించారు ఓ ఆటో డ్రైవర్.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ-ఆటోరిక్షాలో నలుగురు ప్రయాణీకులకు నాలుగు గదులుగా విభజించాడు డ్రైవర్.. అలాగే డ్రైవర్ సీటును ప్రయాణీకుల సీట్లనుంచి మరింతగా వేరుచేశాడు. డ్రైవర్ వినూత్న ఆలోచనపై ప్రశంసలు కురిపించారు ఆనంద్ మహింద్ర.
ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.. అందులో ఇలా రాశారు.. 'క్లిష్ట పరిస్థితుల్లో వేగవంతమైన, వినూత్న ఆలోచనలు చేయగల సామర్థ్యం మన సొంతం. నూతన పరిస్థితులకు అనుగుణంగా విభిన్న ఆలోచనలు నన్ను ఆశ్చర్యపరుస్తున్నాయి' అని క్యాప్షన్తో వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోను మహింద్రా ఆటో, ఫార్మ్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ జెజురికర్ ను ట్వీట్కు ట్యాగ్ చేశారు.. ఈ డ్రైవర్ ను తమ కంపెనీలో సలహాదారుగా పెట్టుకుందామని సూచించారు. కాగా, 27 సెకండ్ల నిడివిగల ఈ వీడియోకు 10 వేల వ్యూస్ రాగా.. 9 వేల లైకులు వచ్చాయి. ఈ పోస్ట్ 5,700 సార్లకు పైగా రీట్వీట్ చేశారు, పోస్ట్ చేయబడినప్పటి నుండి 26,000 మందికి పైగా వినియోగదారులు లైక్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com