చాలా చేస్తున్నాను.. మళ్లీ నేనే అధ్యక్షపదవిని..: ట్రంప్
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మృతులు 70 వేలకు పైనే చేరవచ్చని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంచనా వేశారు. అసలు సంఖ్య మరింత ఎక్కువే వుండొచ్చని అంటున్నారు. సోమవారం రాత్రి వైట్హౌస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అమెరికాలో నెలకొన్న పరిస్థితుల గురించి మాట్లాడారు. నవంబర్లో జరగబోయే ఎన్నికల గురించి కూడా ప్రస్తావించారు.
ఓ విలేకరి అధ్యక్షుడిని ప్రశ్నిస్తూ.. వియత్నాం యుద్ధంలో మరణించిన వారికంటే కరోనా వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్యే ఎక్కువవుంది కదా.. మరలాంటప్పుడు మళ్లీ మీరే గెలుస్తారని ఎలా అనుకుంటున్నారు అని అడిగారు. దానికి ట్రంప్ సమాధానమిస్తూ నేను చాలా మంచి నిర్ణయాలే తీసుకున్నా.. అందుకే మరణాల సంఖ్య 70 వేలకే పరిమితమైంది.. లేకపోతే మరణాల సంఖ్య దాదాపు 2.2 మిలియన్లు ఉంటుందని అంచనా.
వైరస్ను కట్టడి చేసే నిమిత్తం ముందు జాగ్రత్త చర్యగా సరిహద్దులు మూసివేశాం, చైనా వారిని దేశంలోకి రాకుండా నిషేధించాం.. ఇలాంటి నిర్ణయాలెన్నింటినో ఇంకా చాలానే చేశాం. మళ్లీ అధ్యక్ష పదవిని చేపట్టడానికి ఇంతకంటే మంచి విషయాలేవి ఉంటాయని ఆయన అన్నారు. కాగా, అమెరికాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,08,571కాగా, మరణించిన వారి సంఖ్య 56,521గా నమోదైంది. ఇక చికిత్స పొంది కోలుకున్నవారు 1,13,380 మంది అని తాజా గణాంకాలు చెబుతున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com