మృత్యువు శునకం రూపంలో వెంబడించి..
కరోనా కట్టడికి తీసుకుంటున్న నివారణ చర్యలను పర్యవేక్షిస్తున్నారామె. విధులు ముగించుకుని ఇంటికి వెళుతూ శునకాలు వెంబడించడంతో బండి మీద నుంచి పడి మృత్యులోకానికి చేరుకున్నారు. ఈ విషాద సంఘటన ఒంగోలు గ్రామీణ మండలం త్రోవగుంట సమీపంలో జరిగింది. కోటపూడి సువర్ణలక్ష్మి మార్టూరు మండలం వలపర్ల-2 పంచాయితీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా సోమవారం విధులు నిర్వహించారు.
అనంతరం బంధువు బండిపై ఇంటికి చేరుకునే నిమిత్తం బయల్దేరారు. జాగర్లమూడి సమీపంలో వారి వాహనాన్ని శునకాలు వెంబడించాయి. దాంతో వెనుక కూర్చున్న సువర్ణలక్ష్మి భయపడిపోయారు. ఈ క్రమంలో ఆమె వాహనం పై నుంచి దూకారు. దీంతో ఆమె తల డివైడర్ను తాకడంతో తీవ్రగాయాలయ్యాయి. దగ్గరలోని ప్రవైట్ ఆసుపత్రికి తరలించినా లాభంలేకపోయింది. చికిత్స పొందుతూ మరణించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com