కేబుల్ ఆపరేటర్ ఎంత పని చేశాడు.. ఛాయ్ తాగి చాలా మందికి..
ఏంటో ఈ కరోనా వైరస్.. ఒక్కళ్లతో పోద్దనుకుంటే.. వందమందికి అంటించి కానీ వదల బొమ్మాళీ అంటూ పాజిటివ్ కేసుల సంఖ్యను పెంచేస్తోంది. కేసులు తగ్గుముఖం పడుతున్నాయి కదా అనుకుంటే ఒకరి నుంచి ఇద్దరో ముగ్గురో కాదు ఏకంగా 100, 150మంది వైరస్ బారిన పడుతున్నారు. అసలే కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన చెందుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పిడుగులాంటి వార్త మరొకటి వచ్చి చేరింది.
గుంటూరు జిల్లా నరసరావు పేటకు చెందిన కేబుల్ ఆపరేటర్ ఏప్రిల్ 7న తీవ్ర అస్వస్థతకు గురై ఫీవర్ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు అతడిని పరీక్షించి కరోనా పాజిటివ్ అని తేల్చారు. చికిత్స పొందుతూనే అతడు ఏప్రిల్ 9న మరణించాడు. అతడు ఎవరెవరిని కలిసాడు అని ఆరా తీసి దాదాపు 50 మందికి టెస్ట్ చేశారు. అందరికి పాజిటివ్ అని వచ్చింది. కేబుల్ ఆపరేటర్ ఇంటి పక్కనే ఉన్న హోంగార్డు టెస్ట్ చేయించుకుంటే అతడికి పాజిటివ్ అని తేలింది. అతడి నుంచి ఆస్పత్రిలోని నలుగురు డాక్టర్లతో సహా 20 మందికి వైరస్ వ్యాపించింది. ఇంతకీ కేబుల్ ఆపరేటర్కి కరోనా ఎలా సోకింది అని కనుక్కుంటే మార్చి 23న మర్కజ్ వెళ్లి వచ్చిన స్నేహితుడితో కలిసి ఛాయ్ తాగాడు. అతడి నుంచి కేబుల్ ఆపరేటర్కు కరోనా సోకిందని పోలీసులు తేల్చారు. ఇలా కరోనా వైరస్ 105 మందికి సోకింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com