తెలంగాణలో వలస కూలీలను స్వరాష్ట్రాలకు పంపే ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేత
లాక్డౌన్ వల్ల తెలంగాణలో చిక్కుకుపోయిన వలస కూలీలను స్వరాష్ట్రాలకు పంపే విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో.. తాత్కాలికంగా ఈ ప్రక్రియను ఆపేశారు. కొన్ని రాష్ట్రాలు కూలీలను రానిచ్చే విషయంలో అనుమతులు ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైంది. వైద్య పరీక్షలతో పాటు క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేసే విషయంలో ఇబ్బందుల్ని ఆయా రాష్ట్రాలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. గురువారం వరకు తెలంగాణ నుంచి దక్షిణ మధ్య రైల్వే 11 రైళ్లను నడిపింది. ఇందుకోసం ప్రభుత్వం సుమారు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్లకు 12వేల 803 మందిని పంపించగలిగారు. మొత్తం వలస కూలీలు 3 లక్షల వరకూ ఉంటారనే అంచనాల నేపథ్యంలో.. రోజుకు 40 రైళ్లు ఏర్పాటు చేయాలని సర్కారు కోరింది. ఐతే.. ఉత్తరాది రాష్ట్రాలు తమ వాళ్లను రిసీవ్ చేసుకునేందుకు సమయం కోరుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఇక్కడి నుంచి స్వస్థలాలకు వెళ్లేందుకు 2 లక్షల 78 వేల మంది తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. యూపీకి 67 వేలు, బీహార్కి 66వేలు, బెంగాల్కి 45వేలు, ఒడిశాకి 34వేలు, జార్ఖండ్ 29 వేల మంది వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆయా రాష్ట్రాల నుంచి సానుకూల స్పందన లేనందున తాత్కాలికంగా తరలింపు ఆగిపోయింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com