ఆరు రోజులైనా గ్యాస్ లీక్ ప్రమాదం నుంచి కోలుకోని గ్రామాలు
విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదం నేపథ్యంలో ఆ గ్రామాలన్నీ ఇంకా భయం గుప్పిట్లోనే ఉన్నాయి. ఆరు రోజులైనా గ్యాస్ లీక్ ప్రమాదం నుంచి గ్రామాలు కోలుకోలేదు. భయంతో ఊళ్లలోకి వెళ్లలేకపోతున్నారు అక్కడి ప్రజలు.. వేలాది మంది పునరావాస కేంద్రాల్లో, స్నేహితుల ఇళ్లలో ఉండిపోయారు. అధికారులు పరిస్థితి అదుపులోనే ఉందని చెబుతున్నా గ్రామస్తులు మాత్రం ఆ మాటలను నమ్మలేకపోతున్నారు. సోమవారం తిరిగి ఇళ్లకు చేరిన వారు 1500 మంది లోపే ఉన్నారు.. ఇళ్లలో స్టైరిన్ వాసన ఇంకా తగ్గలేదని మరికొందరు ఆందోళన చేస్తున్నారు.. అటు మంగళవారం కూడా ఎల్జీ పాలిమర్స్లో దర్యాప్తు బృందం విచారణ కొనసాగనుంది. స్టైరిన్ ట్యాంక్ ఉష్ణోగ్రత 72 డిగ్రీలకు తగ్గిందని నిపుణులు నిర్ధారించారు.. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ఐదు గ్రామాల పరిధిలో నిపుణుల కమిటీలు పర్యటించనున్నాయి. మరోవైపు పరిహారంపై ఆర్.ఆర్.వెంకటాపురం గ్రామస్తులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తమకు కూడా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అటు కేజీహెచ్లో చికిత్స పొందుతున్న వారిలో మంగళవారం కొందరు డిశ్చార్జ్ కానున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com