ఏపీలో బ్లీచింగ్ స్కాం.. టీవీ5 కథనాలతో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు
గుంటూరు జిల్లాలో బ్లీచింగ్ కొనుగోళ్ల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. టీవీ 5 వరుస కథనాలతో... బ్లీచింగ్ స్కాంలో వాస్తవాలు తెలుస్తున్నాయి. దీంతో... ఈ కుంభకోణంపై..ఆరా తీసిన జిల్లా కలెక్టర్..దర్యాప్తుకు ఆదేశించారు. జిల్లాలోని నరసరావుపేటలో.. బ్లీచింగ్ కోనుగోలులో భారీ స్కాం జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఎలాంటి టెండర్లు పిలవకుండానే.. కాంట్రాక్టర్లకు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ఓ పక్క.. కరోనాతో ప్రజలు భయాందోళనకు గురవుతుంటే... జిల్లాలోని కొందరు రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు.. బ్లీచింగ్ స్కాంలో వాటాల కోసం తెగ ఆరాటపడుతున్నట్లు వెల్లడైంది.
జిల్లా వ్యాప్తంగా కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు తప్పనిసరిగా బ్లీచింగ్, శానిటైజర్, మాస్కులు, కలరా ఉండలు, హైపోక్లోరైడ్ ద్రావణం అవసరం.! వీటి కొనుగోలు చేసేందుకు జిల్లా అధికారులు ఎలాంటి టెండర్లు కూడా పిలవకుండానే.. కాంట్రాక్టర్లకు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. జిల్లాలో దాదాపు ఏడాది నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. ఇదే అటు అధికారులకు, ఇటు రాజకీయ నాయకులకు కలిసొచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే 14వ ఆర్ధిక సంఘం నిధుల్ని కేంద్రం విడుదల చేసింది. రెడ్ జోన్ సాకు చూపుతూ.. పారిశుద్ధ్య పనుల కోసం... 16 కోట్ల రూపాయలు నిధులను డ్రా చేశారు అధికారులు. ఒక్క నరసరావుపేటలోనే.. దాదాపు రూ. 4.72 లక్షలకి బ్లీచింగ్ బిల్లులు చేసిన అధికారులు.. మరో 4 లక్షల రూపాయలకు సైతం బిల్లులు పెట్టబోతున్నారు. ఇక నరసరావుపేట మండలంలో ఇప్పటికే 3.17 లక్షలకు బిల్లులు చేయగా.. మరో మూడు లక్షల రూపాయలకు బిల్లులు పెడుతున్నారు.
ఇక ఈ బ్లీచింగ్నంతా.. ఎంపీడీవో కార్యాలయంలో పని చేసే అధికారి వద్దే కొంటున్నట్లు తెలుస్తోంది. బ్లీచింగ్ సైతం కేవలం పల్నాడు నుంచే తరలిస్తున్నట్లు బయటపడింది. వాస్తవానికి... పేరుకే గుంటూరు, విశాఖపట్నం, విజయవాడలోని కాంట్రాక్టర్ల వద్ద కొంటున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ... కొంటున్న బ్లీచింగ్లో దాదాపు 90 శాతం పిడుగుగురాళ్ల సున్నమేని తెలుస్తోంది. ఇక ఒక కిలో బ్లీచింగ్ ధర మార్కెట్లో 25 రూపాయలు ఉంటే.. ఇక్కడి అధికారులు మాత్రం.. ఏకంగా 50 రూపాయలు పెట్టి కొంటున్నారు. ఇక 25 కిలోల ఒరిజినల్ బ్లీచింగ్ పౌడర్ బస్తా 5వందల రూపాయలకు అమ్ముతున్నారు. ప్రభుత్వం ఒకే సారి పెద్ద మొత్తంలో తీసుకుంటుంది కాబట్టి..350 రూపాయలకే ఇచ్చే సంస్థలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఇవేవి కాదని.. కిలో 50రూపాయలకు కొనుగోలు చేసి భారీ అక్రమాలకు పాల్పడుతున్నారు అధికారులు.
ఈ మొత్తం బ్లీచింగ్ స్కాంలో పల్నాడులో ఓ యువ ఎమ్మెల్యే.. చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ఆయన హుకుం జారీ చేయడం వల్లే.. అధికారులు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాను చెప్పిన చోటే చెప్పిన రేటుకే బ్లీచింగ్ కొనాలంటూ.. ఈ యువనేత.. ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com