కరువు సీమలో వజ్రాల పంట.. తొలకరి జల్లులతో బయటకు వస్తున్న డైమండ్స్

కరువు సీమలో వజ్రాల పంట.. తొలకరి జల్లులతో బయటకు వస్తున్న డైమండ్స్

ఆ ప్రాంతంలో తొలకరి జల్లు పడితే చాలు భూమి నుండి వజ్రాలు బయటకు వస్తాయి. నేలను చీల్చుకుని ఆకాశం వైపు చూస్తాయి. కరువు సీమలో వజ్రాల పంట పండుతోంది. అవును.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరితో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో వజ్రాలు దొరుకుతున్నాయి. దీంతో స్థానికుల సంతోషానికి అవధుల్లేవు.

తొలకరి జల్లులు కురవడంతో భూమి నుంచి వజ్రాలు బయటకు వస్తున్నాయి. దీంతో జొన్నగిరిలో వజ్రాల వేట జోరుగా కొనసాగుతోంది. స్థానికులతో పాటు పక్క రాష్ట్రాల వారు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వజ్రాల కోసం వేట సాగిస్తున్నారు. డైమండ్ల కోసం విరామం లేకుండా వెతుకుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

గురువారం పగిడిరాయి గ్రామంలో ఓ రైతు పొలం పనులు చేస్తుండగా లక్ష రూపాయల విలువ చేసే వజ్రం దొరికింది. అదే రోజు బొల్లవాని పల్లెలో ఒక గొర్రెల కాపరికి 50 వేల విలువ చేసే డైమండ్‌ దొరికింది. ఈ రెండు వజ్రాలను పెరవలి, జొన్నగిరి గ్రామాలకు చెందిన వ్యాపారస్తులు కొనుగోలు చేశారు.

తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇతర రాష్ట్రాల వారు అక్కడే మకాం వేసి వజ్రాల అన్వేషణ చేస్తున్నారు. దొరికిన వారు సంతోషంతో వెళ్తుంటే.. దొరకని వారు వజ్రాల కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story