విషాదం.. బావిలో శవమై తేలిన వలస కుటుంబం
పొట్టకూటి కోసం వచ్చిన ఓ వలస కుటుంబం అనుమానాస్పద స్థితిలో బావిలో శవమై తేలింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో కలకలం రేపింది. పశ్చిమబెంగాల్కు చెందిన మసూద్ అతని భార్య నిషా 20 ఏళ్ల క్రితం కూలి పని కోసం వరంగల్కు వచ్చారు. అతనికి ఇద్దరు కుమారులున్నారు. శాంతినగర్ మార్కెట్ పరిసరాల్లో గన్ని సంచులు కుడుతూ జీవనం సాగించేవారు. లాక్డౌన్ నేపథ్యంలో గొర్రెకుంట శివార్లలో ఉన్న సాయిదత్త ట్రేడర్స్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. భర్తతో విడాకులు తీసుకున్న మసూద్ కూతురు కూడా కొడుకుతో కలిసి అక్కడే ఉంటుంది.
సాయి దత్త ట్రేడర్స్ యజమాని గోదాంకు రాగా మసూద్ కుటుంబ సభ్యులెవరూ కనిపించలేదు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గాలింపు చేపట్టిన పోలీసులకు సమీపంలోనే ఉన్న పాడుబడ్డ బావిలో నలుగురి మృతదేహాలు కనిపించాయి. మసూద్, అతని భార్య నిషా, కూతురు, మూడేళ్ల బాలుడి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టంకు తరలించారు. అయితే మసూద్ ఇద్దరి కుమారుల ఆచూకి కనిపించకపోవడంతో పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా మసూద్ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని.. ట్రేడర్స్ యజమాని తెలిపాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com