పసుపు పండుగ.. కార్యకర్తలే పార్టీకి బలం : చంద్రబాబునాయుడు

పసుపు పండుగ.. కార్యకర్తలే పార్టీకి బలం : చంద్రబాబునాయుడు

పసుపు పండుగ ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద పండుగలా భావించే మహానాడు ప్రారంభమైంది. టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు, పార్టీ కేంద్ర కార్యాల యంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, అయ్యన్న పాత్రుడు, దేవినేని ఉమ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బోండా ఉమ, నారా లోకేష్ సహా పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలు, విదేశాల్లోని పార్టీ ఎన్ఆర్‌ఐ విభాగానికి చెందిన నాయకులు, కార్యకర్తలు ఈ ప్రోగ్రామ్‌లో భాగస్వామ్యమయ్యారు. దాదాపు 14 వేల మంది మహానాడుకు హాజరయ్యారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ ‌అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చంద్రబాబు గుర్తు చేశారు.

కార్యకర్తలే పార్టీకి బలం అని చంద్రబాబునాయుడు అన్నారు. కష్టకాలంలోనూ కార్యకర్తలే పార్టీకి అండగా నిలిచారని ప్రశంసించారు. పార్టీకి విధేయులకు కృతజ్ణతలు తెలిపిన చంద్రబాబు కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. వైసీపీ ప్రభుత్వం మొదటి సంవత్సర పాలనలోనే రాష్ట్రంలో అవినీతి పెచ్చుమీరి పోయిందని ధ్వజమెత్తారు.

విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. గ్యాస్ లీకేజీ ఘటనను వైసీపీ ప్రభుత్వం తేలిగ్గా తీసుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్టైరీన్ గ్యాస్ ప్రభావం ఎంత వరకు ఉంటుందో ప్రభుత్వం అంచనా వేయలేకపోతోందన్నారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై చంద్రబాబు ఫైరయ్యారు. రాజకీయ లబ్ది కోసం దేవున్ని కూడా జగన్ వాడుకుంటున్నారని మండిపడ్డారు. టీటీడీ భక్తి, పవిత్రత రెండూ పోయే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. పింక్ డైమండ్‌పై విచారణ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

మొదటిరోజు మహానాడులో మొత్తం 11 తీర్మానాలు చేశారు. మరణించిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు సంతాపం తెలుపుతూ ఒక తీర్మానం, ఎల్జీ పాలిమర్స్ ఘటనపై రెండో తీర్మానం, విద్యుత్ ఛార్జీ ల పెంపు-మాట తప్పిన జగన్‌ అంటూ మూడో తీర్మానం, కరోనా వైరస్ విజృంభణ-వలస కార్మికుల కష్టాలపై నాలుగో తీర్మానం ప్రవేశపెట్టారు. టీటీడీ ఆస్తుల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ ఐదో తీర్మానం చే శారు. భోజన విరామం తర్వాత మరో ఆరు తీర్మానాలు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వ తొలి ఏడాది పాలనను సమీక్షిస్తూ అరాచక పాలనకు ఏడాది-ప్రమాదంలో ప్రజాస్వామ్యం పేరుతో తీర్మానం ప్రవేశపెట్టా రు. రైతుల కష్టాలను ప్రస్తావిస్తూ అన్నదాత వెన్ను విరిచిన జగన్ సర్కార్‌ అంటూ మరో తీర్మానం ప్రతిపాదించారు. సంక్షోభంలో సాగునీటి ప్రాజెక్టులు-పోలవరాన్ని రెండేళ్లు వెనక్కి నెట్టారు అంటూ ఇం కో తీర్మానం పెట్టారు. అక్రమ కేస్తులు ఆస్తుల విధ్వంసంపై మరో తీర్మానం వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రెండు తీర్మానాలు ప్రతిపాదించారు. వ్యవసాయంపై ఒక తీర్మానం, సాగునీటి ప్రాజెక్టులపై రెండో తీర్మానం ప్రతిపాదించారు. టీడీపీ సీనియర్ నాయకులు వంతుల వారీగా తీర్మానాలు ప్రవేశపెట్టారు.

ఈసారి మహానాడును డిఫరెంట్‌గా నిర్వహించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో డిజిటల్ పద్ధతిలో మహానాడు జరిగింది. వేలమంది ఆన్‌లైన్ ద్వారా మహానాడులో భాగస్వామ్యమయ్యారు. వేలమందిని భాగస్వామ్యం చేస్తూ ఆన్‌లైన్‌లో ఇలాంటి కార్యక్రమం చేయడం దేశంలో ఇదే మొదటిసారి.

Tags

Read MoreRead Less
Next Story