యువకుడితో పారిపోయిందని బాలికను చితకబాదారు

యువకుడితో పారిపోయిందని బాలికను చితకబాదారు

గుజరాత్‌లో దారుణం చోటుచేసుకుంది. చోటా ఉదేపూర్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన 16 ఏళ్ల గిరిజన బాలికను కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తితో పారిపోయినందుకు ఆమె తండ్రి , స్థానికుల సమక్షంలో ముగ్గురు వ్యక్తులు చితకబాదారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన మే 21 న చోటా ఉదేపూర్ జిల్లాలోని బోడెలి పట్టణానికి సమీపంలో ఉన్న బిల్వంత్ గ్రామంలో జరిగింది, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ దారుణ దాడి వీడియో వైరల్ కావడంతో ఇది పోలీసుల దృష్టిని ఆకర్షించింది. అయితే ఇంతవరకు అరెస్టులు జరగలేదని పోలీసులు తెలిపారు. ఆ బాలిక తక్కువ కులంలో పుట్టడమే గాక యువకుడితో పారిపోయి కులం పరువు తీసిందంటూ తాడుతో కట్టేసి ముగ్గురు వ్యక్తులు విచక్షణారహితంగా ఆమెను చితకబాదారు.

ఒకరు ఆమెపై దాడి చేస్తుంటే మరొకరు వీడియో తీశారు. మొదట ఆ బాలికను ఇద్దరు పట్టుకోగా మరొకరు కట్టెతో శరీరంపై చావబాదారు. ఆ తర్వాత బాలికను కింద పడేసి కాలితో ముఖం మీద, వీపు మీద ఇష్టం వచ్చినట్లు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన మొత్తం ఆ యువతి తండ్రి సమక్షంలోనే జరిగింది, తన కుమార్తెను చితకబాదుతున్నా అలాగే చూస్తూ ఉండిపోయారు కానీ ఏమి చెయ్యలేదు. బాధితురాలి తండ్రి నుంచి అధికారిక ఫిర్యాదు తీసుకొని పోలీసు బృందం బుధవారం గ్రామానికి చేరుకుని రంగ్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.

కాగా బాలిక ఒక వ్యక్తితో పారిపోయి, పొరుగున ఉన్న మధ్యప్రదేశ్ లోని ఒక గ్రామానికి వెళ్ళింది. కొద్ది రోజుల క్రితం తిరిగి వచ్చిన తరువాత ఆమెపై నిందితులు ఇలా విశ్చక్షణా రహితంగా దాడి చేశారు. సంఘటన స్థలంలో ఉన్న ఈ ముగ్గురు వ్యక్తులు, అలాగే మరో 13 మందిపై మేము కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మొత్తం 16 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇంకా ఎవరిని అరెస్ట్ చేయలేదని తెలిపారు. ముగ్గురు నిందితులను దేశింగ్ రత్వా, భీప్లా ధనుక్, ఉడేలియా ధనుక్ గా పోలీసులు గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story