తప్పించుకున్న చిరుత.. సీసీటీవీ కెమెరాలో..
హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్ చుట్టుపక్కల చిరుతపులి సంచరిస్తోంది. ఈ మధ్యే ఆరాంఘర్ బ్రిడ్జి దగ్గర.. నడిరోడ్డుపై కనిపించిన చిరుత.. స్థానికుల్ని భయభ్రాంతులకు గురిచేసింది. ఓ లారీ డ్రైవర్ను గాయపరిచింది. అటువైపు ఉన్న ఓ ఫాంహౌస్లోకి దూరిన చిరుత.. తర్వాత కనిపించలేదు. హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల్లో అడుగు జాడలు గుర్తించారు. కానీ.. అది ఎటువైపు వెళ్లింది.. ఎక్కడ తిరుగుతోందో గుర్తించలేకపోయారు. ఇన్నాళ్ల తర్వాత ఆ చిరుత మళ్లీ కనిపించింది. సీసీటీవీ కెమెరాలకు చిక్కింది.
రాజేంద్రనగర్ పరిధిలోనే చిరుత సంచరిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ-మేనేజ్కు వెళ్లే దారిలో చిరుత తిరుగుతోంది. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన వర్సిటీ సెక్యూరిటీ గార్డులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చిరుత సంచారం దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో.. సమీపంలోని కాలనీల ప్రజలను అప్రమత్తం చేశారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com