కరోనా ఎఫెక్ట్.. వారానికి రెండ్రోజులే బడి..

కరోనా ఎఫెక్ట్.. వారానికి రెండ్రోజులే బడి..

కరోనా వైరస్ కారణంగా బడులు తెరవాలంటేనే భయపడుతోంది ప్రభుత్వం. కొన్ని మార్పులు చేర్పులతో పిల్లలు పాఠశాలకు వెళ్లేలా చర్యలు రూపొందిస్తోంది. మొత్తం 220 రోజుల పని దినాల్లో 20 రోజులు కౌన్సిలింగ్‌కి, 100 రోజులు ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్ క్లాసులు, 100 పాఠశాలకు వెళ్లేలా ప్రణాళికలు రచిస్తోంది కేంద్ర మానవ వనరుల శాఖ. ఇక పీరియడ్ సమయాన్ని కూడా 45 నిమిషాలు ఉన్నదాన్ని 30 నిమిషాలకు కుదించే అవకాశం ఉంది. ఈ వివరాలతో పాఠశాలల పునఃప్రారంభం పేరిట త్వరలోనే మార్గదర్శకాలను జారీ చేయనున్నారు.

పిల్లలందరూ ఒకే సారి స్కూలుకు వెళ్లకుండా రెండు షిప్ట్‌లు నడపాలనుకుంటోంది. అంటే ఉదయం కొన్ని క్లాసులు హాజరైతే, మధ్యాహ్నం మిగిలిన క్లాసులు హాజరయ్యేలా చూడాలనుకుంటుంది. ఏది ఏమైనా 30 నుంచి 50 శాతం మించి విద్యార్థులు హాజరు కాకుండా చూసుకోవాలని కేంద్ర మానవ వనరుల శాఖ ప్రతిపాదించింది. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులు వారానికి రెండు సార్లు, 6 నుంచి 8వ తరగతి విద్యార్థులు వారానికి 2 నుంచి 4 సార్లు.. 9 నుంచి 12 వ తరగతి వరకు వారానికి 4 నుంచి 5 సార్లు బడికి వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. పరీక్షల విధానంలో కూడా మార్పులు తీసుకురానుంది.

ఒత్తిడి లేని అసైన్‌మెంట్ విధానం వైపు మొగ్గుచూపుతోంది. 5వ తరగతి లోపు స్కూలు బ్యాగు తప్పని సరి కాదనే అవకాశం ఉంది. ఇక వలస కార్మికుల పిల్లలకు దగ్గర్లోని బడిలో ప్రవేశం కల్పించమంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచనలు చేయనుంది. వారికి ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. టీసీ అడగకూడదని ప్రతిపాదించనుంది. ఇక పిల్లల వ్యక్తిగత శుభ్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోనుంది. బస్సులో సీటుకి ఒకరే కూర్చోవడం, బస్సులను రెండు రోజులకు ఒకసారి శానిటైజేషన్ చేయడం, భౌతిక దూరం పాటించడం, పాఠశాలల్లో ధర్మామీటర్లు, సబ్బులు, మాస్కులు ఉండేలా చర్యలు తీసుకోవడం వంటి ఎన్నో మార్పులతో ఈసారి బడి మొదలవబోతోంది.

Tags

Read MoreRead Less
Next Story