ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు సోమవారం కేరళ తీరాన్ని తాకిన సంగతి తెలిసిందే. అయితే ఈ నైరుతి రుతుపవనాలు కేరళ నుంచి ఏపీలోకి ప్రవేశించినట్లు విజయవాడ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ అరేబియా సముద్రం, లక్షద్వీప్ దీవులు, మాల్దీవులు, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లోని కొన్ని ప్రాంతాలు, కోమోరిన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలలోనికి నైరుతి రుతుపవనాలు విస్తరించాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
మరోవైపు రాబోయే మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని.. అలాగే అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. అంతేకాదు సోమవారం రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com