నిసర్గ తుఫాను : నలుగురు మృతి.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
నిసర్గ తుఫాను మహారాష్ట్రలోని ఆలీబాగ్ వద్ద బుధవారం మధ్యాహ్నం తీరాన్ని తాకిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. దాంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ముఖ్యంగా రాయ్గడ్ జిల్లాలో బలమైన గాలులు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఎక్కడపడితే అక్కడ రోడ్లమీద చెట్లు, విద్యుత్ స్థంబాలు విరిగిపడ్డాయి. దీంతో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డిఆర్ఎఫ్) సహాయక చర్యలు కొనసాగిస్తోంది.
మరోవైపు నిసర్గ తుఫాను ధాటికి మరణించిన వారి సంఖ్య 4 కి చేరుకుంది. అంతకుముందు పూణేలో ఇద్దరు, రాయ్గడ్ జిల్లాలో ఒకరు తుఫాను సంబంధిత ప్రమాదాల కారణంగా మరణించారు. నాల్గవ మరణం అలీబాగ్ లో సంభవించింది. మరోవైపు ముంబై, థానే, పాల్ఘర్ పరిసర ప్రాంతాలలో భారీగా వర్షపాతం నమోదయింది. బలమైన ఈదురుగాలుల ప్రభావంతో చెట్లు, ఇళ్ళు కూలాయి.. కొన్ని చోట్లా చెట్లు కూలి వాహనాల మీద పడటంతో వాహనాలు దెబ్బతిన్నాయి. దీంతో ముంబై,రాయ్గడ్ పరిసర ప్రాంతాల్లో 20 ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది మోహరించారు. ఇదిలావుంటే పాల్ఘర్, థానే, ముంబై, రాయ్గడ్ జిల్లాల్లో గురువారం మధ్యాహ్నం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com