కువైట్ సంచలన నిర్ణయం.. ఉపాధి కోల్పోనున్న భారతీయులు

కువైట్ సంచలన నిర్ణయం.. ఉపాధి కోల్పోనున్న భారతీయులు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భవిష్యత్తులో చాలా మార్పులకు తెరలేపుతోంది. ఉపాధి కోసం దేశాలు దాటి వెళ్లిన వలస కార్మికులు మళ్లీ పొట్ట చేతబట్టుకుని స్వదేశానికి తిరిగి రావలసిన పరిస్థితులు దాపురించనున్నాయి. ఈ నేపథ్యంలో కువైట్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో దేశ జనాభాలో 70 శాతంగా ఉన్న వలస కూలీల సంఖ్యను 30 శాతానికి తగ్గించాలని కువైట్ ప్రధాని షేక్ సబా అల్ ఖలీద్ అల్ హమద్ అల్ సబా నిర్ణయించారు. వైరస్ ప్రభావంతో చమురు ధరలు భారీగా పడిపోయాయి. దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడింది.

ఈ నేపథ్యంలో అనేకమంది తమ ఉపాధిని కోల్పోవలసి వస్తోంది. దాంతో కువైట్ పౌరులకు ఉద్యోగాలు కల్పించాలంటే ప్రవాసుల సంఖ్యను తగ్గించడం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది ప్రభుత్వానికి. కాగా, కువైట్ మొత్తం జనాభా 48 లక్షలు ఉంటే అందులో విదేశీయులే 34 లక్షల మంది ఉన్నారు. ఇందులో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ లకు చెందినవారే అధికమని కువైట్ ప్రధాని పేర్కొన్నారు. కువైట్ తీసుకున్న తాజా నిర్ణయంతో భారతదేశానికి చెందిన లక్షల మంది ఉపాధి కోల్పోనున్నారు. ప్రవాస భారతీయులు ఎక్కువగా ఇళ్లలో పని చేస్తుంటారు. వీరే 6.5 లక్షల మంది ఉన్నారని అంచనా.

Tags

Read MoreRead Less
Next Story