గుజరాత్ లో అప్రమత్తమైన కాంగ్రెస్.. రిసార్టుకు ఎమ్మెల్యేల తరలింపు!

రాజ్యసభ ఎన్నికల ముందు గుజరాత్ లో ఎమ్మెల్యేల రాజీనామాలతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. మిగిలిన ఎమ్మెల్యేలు చేజారిపోకుండా రిసార్టుకు తరలించాలని నిర్ణయించింది. అందులో భాగంగా మొదట పంతొమ్మిది మంది కాంగ్రెస్ శాసనసభ్యులను రాజస్థాన్లోని రిసార్ట్కు తరలించింది. రాజస్థాన్ మౌంట్ అబూలో ఉన్న వైల్డ్ విండ్స్ అనే రిసార్ట్ కు పలువురు ఎమ్మెల్యేలను తరలించినట్టు తెలుస్తోంది. అలాగే మరో 26 మంది ఎమ్మెల్యేలను కూడా తరలించే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాజస్థాన్ లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి.. బిజెపి జోక్యం ఉండదనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యేలను అక్కడికి తరలించారు.
కాగా 182 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో బిజెపికి 103 మంది సభ్యులు ఉన్నారు, కాంగ్రెస్కు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో బీజేపీకి రెండు సీట్లు దక్కుతాయి. మిగిలిన రెండు ప్రతిపక్షాలకు దక్కుతాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేయడంతో ఒక సీటు మాత్రమే వస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గుజరాత్ ఎన్నికలకు నాలుగు రాజ్యసభ స్థానాల్లో బిజెపికి వస్తాయని భావించి.. అభ్యర్థులుగా నార్హరి అమీన్, అభయ్ భరద్వాజ్, రామిలాబెన్ బారాలను నిలబెట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com