దక్షిణ కాశ్మీర్లో నలుగురు ఉగ్రవాదుల ఏరివేత
దక్షిణ కాశ్మీర్లోని షోపియన్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. సుగూ హెన్ధామా ప్రాంతంలో బుధవారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య తీవ్రమైన తుపాకీ పోరాటం జరిగింది. ఎన్కౌంటర్లో ఇప్పటివరకు నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. కాశ్మీర్ పోలీస్, ఆర్మీ 44 ఆర్ఆర్ , సిఆర్పిఎఫ్ సంయుక్త బృందం బుధవారం ఉదయం సుగూ హెన్ధమాలో కార్డన్-అండ్-సెర్చ్ఆపరేషన్ ప్రారంభించిందని, ఇది ఎన్కౌంటర్ కు దారితీసిందని తెలిపారు.
ఈ ఆపరేషన్లో ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కాశ్మీర్ జోన్ విజయ్ కుమార్ తెలిపారు. అయితే, హతమైన ఉగ్రవాదుల గుర్తింపును ఇంకా నిర్ధారించలేదని ఆయన అన్నారు. కాగా ఎన్కౌంటర్ లో భాగంగా ముందుజాగ్రత్త చర్యగా జిల్లాలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఆదివారం నుంచి సోమవారం వరకూ జరిగిన రెండు ఎన్కౌంటర్లలో 9 మంది ఉగ్రవాదులు మరణించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com