3 బల్బులు.. ఓ ఫ్యాన్.. కరెంట్ బిల్లు చూస్తే..
ఓ ఇంట్లో 3 బల్బులు.. ఓ ఫ్యాన్ ఉంటే కరెంట్ బిల్లు ఎంత వస్తుంది. మహా అయితే నాలుగు, ఐదు వందలు దాటదు. కానీ కామారెడ్డి జిల్లా ఇశ్రోజివాడికి చెందిన ఓ ఇంటి యజమానికి.. కరెంట్ బిల్లు చూడగానే షాక్ కొట్టినంత పనైంది. వందలు కాదు..వేలు కాదు ఏకంగా లక్షల్లో కరెంట్ బిల్లు వచ్చింది. శ్రీనివాస్ అనే వ్యక్తి.. ఇంట్లో కేవలం మూడు బల్బులు, ఓ ఫ్యాన్ మాత్రమే వాడుతున్నాడు. వీటికి గతంలో నెలకు 4నుంచి 5 వందల కరెంట్ బిల్లు వస్తుండేది. లాక్డౌన్ కారణంగా రెండు నెలలుగా మీటర్ రీడింగ్ నిలిచిపోయింది.
తాజాగా లాక్డౌన్ సడలింపులతో మళ్లీ రీడింగ్ నమోదు చేశారు. అయితే ఈసారి బిల్లు 7లక్షల 29వేలకు పైగా రావడంతో ఇంటి యజమాని ఖంగుతిన్నాడు. బిల్లు చూడగానే ఒక్కసారిగా అతని గుండె గుభేలుమంది. ఇంటి బిల్లు ఇంత రావడం ఏంటని ఆయోమయానికి గురవుతున్నారు. ఇళ్లు అమ్మినా కూడా బిల్లు చెల్లించలేని పరిస్థితి ఉందంని బాధితులు వాపోతున్నారు. ఈ విషయాన్ని కరెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. బిల్లు లక్షల్లో రావడం తమ తప్పిదమేనని విద్యుత్ అధికారులు చెప్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com