ఆశలు చిగురిస్తున్న చైనా టీకా.. 743మందిపై ప్రయోగం
కరోనా మహమ్మారికి మందు కనిపెట్టేసింది చైనా.. తమ ప్రయత్నాలు ఫలించి మందు మార్కెట్లోకి వస్తే వేల ప్రాణాలు నిలువరించిన వారమవుతామని చైనా ఆశాభావం వ్యక్తం చేస్తోంది. తాము తయారు చేసిన టీకా సానుకూల ఫలితాలను ఇస్తోందని చైనాకు చెందిన ఔషధ తయారీ సంస్థ సినోవ్యాక్ బయోటెక్ పేర్కొంది. మానవులపై ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఈ టీకా మొదటి రెండు దశలు పూర్తి చేసుకుంది. 'కరోనా వ్యాక్' అనే ఈ టీకాను మొత్తం 743 మందిపై ప్రయోగించామని సినోవ్యాక్ పేర్కొంది. 18-59 ఏళ్లు ఉన్నవారిపై ప్రయోగాలు జరిగాయి.
టీకా తీసుకున్న 14 రోజుల తర్వాత వీరిలోని 90 శాతం మందిలో కరోనా వైరస్ తో ఫైట్ చేసే యాంటీ బాడీలు ఉత్పన్నమయ్యాయని పేర్కొంది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి తీవ్ర స్థాయి దుష్ప్రభావాలు ఏమీ ఎదురు కాకపోవడం ఊరటనిచ్చే అంశం. ఇక మూడో దశ ట్రయల్స్ దేశం బయట నిర్వహించాలనుకుంటోంది. ఇందుకోసం బ్రెజిల్ లోని ఇనిస్టిట్యూట్ బుటాన్ టాన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. కొవిడ్-19కు కారణమయ్యే కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేదిశగా ప్రపంచ వ్యాప్తంగా రెండు డజన్లకు పైగా పరిశోధనా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com