భద్రాద్రి రామాలయంలో పవిత్రోత్సవాలు
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. గురువారం నుంచి ఐదు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. గురువారం పవిత్రోత్సవాల తొలి రోజున శత కలశావాహన, అగ్ని ప్రతిష్ఠ, పవిత్రాదివాసం నిర్వహించనున్నారు. శుక్రవారం అష్టోత్తర శతకలశాభిషేకం, పవిత్రారోపణ, శని, ఆదివారాల్లో నిత్య హోమాలు, వేద పారాయణం నిర్వహించనుండగా సోమవారం పూర్ణాహుతి, పవిత్రాలకు ఉద్వాసన, మహాకుంభప్రోక్షణ చేయనున్నారు.
కాగా, బుధవారం పవిత్రోత్సవాలకు అంకురార్పణను నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రం పవిత్ర గోదావరి నది నుంచి పవిత్ర జలాలను తీర్థ బిందెతో తీసుకొచ్చి అంకురార్పణ చేయనున్నారు. ఈ సమయంలో ఐదు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించే అర్చకులకు దేవస్థానం తరపున దీక్షా వస్త్రాలను అందజేయనున్నారు. కాగా పవిత్రోత్సవాలను పురస్కరించుకొని గురువారం నుంచి సోమవారం వరకు ఆలయంలో నిత్య కల్యాణాలను నిలిపివేయనున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com